
7 అంశాలపై చర్చ:
బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులతో శనివారం జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలోనూ లీగ్ ప్రారంభంపై స్పష్టత రాలేదు. కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో టోర్నీ నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించినా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మహమ్మారి కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో మినీ ఐపీఎల్ అంశం తెరపైకి వచ్చినా.. అది ఒక అవకాశం మాత్రమే అని బీసీసీఐ తేల్చినట్లు సమాచారం. నిన్నటి సమావేశంలో మొత్తం 7 అంశాలపై చర్చించినట్లు సమాచారం.

అది కుదించిన ఐపీఎలే:
ఐపీఎల్ పాలక మండలి సమావేశం ముగిసిన తర్వాత సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్ను కుదిస్తారా అని ప్రశ్నించగా... 'ప్రస్తుతం ఐపీఎల్ గురించి నేనేమీ చెప్పలేను. అప్పటికి ఉండే పరిస్థితుల్ని బట్టే ఐపీఎల్ నిర్వహణ సాధ్యాసాధ్యాలు ఆధారపడి ఉంటాయి. టోర్నీని 15 రోజులు వాయిదా వేశామంటే అన్ని రోజుల సమయం పోయినట్టే కదా. ఒకవేళ ఏప్రిల్ 15 నాటికి పరిస్థితులు చక్కబడితే ఐపీఎల్ను కుదిస్తాం. ఎన్ని రోజులు, ఎన్ని మ్యాచులు తగ్గిస్తామో ఇప్పటికైతే చెప్పలేను' అని దాదా స్పష్టం చేసారు.

కరోనా తగ్గుముఖం పట్టడమే ఒక్కటే మార్గం:
ప్రస్తుతం క్యాష్ రిచ్ లీగ్ నిర్వహణ కరోనా వైరస్ తీవ్రతపైనే ఆధారపడి ఉందని కాదనలేని సత్యం. వచ్చే నెల రెండో వారం నాటికి కరోనా ప్రభావం తగ్గితే ఐపీఎల్పై ముందుకు వెళతారు. ఒకవేళ ఇదే అనిశ్చితి ఉంటే మాత్రం లీగ్ జరగకపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. కరోనా వైరస్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉండటంతో.. ఐపీఎల్ను వేరే దేశాల్లోనే తటస్థ వేదికల్లో నిర్వహించే మార్గాలు కూడా లేవు. దీనికి కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడమే ఒక్కటే మార్గం.

మినీ ఐపీఎల్:
బీసీసీఐ, ఫ్రాంచైజీల సమావేశంలో ఏయే అంశాల గురించి చర్చించారో బోర్డు అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. 'ఈ సమావేశంలో బీసీసీఐ, ఫ్రాంచైజీల యజమానులు ఆరు నుంచి ఏడు అంశాలు కూలంకషంగా చర్చించారు. ఐపీఎల్ను కుదించి మ్యాచులు నిర్వహించడం అందులో ఒకటి' అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. జట్లను రెండు బృందాలుగా విడదీసి అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లతో ప్లేఆఫ్స్ ఆడించడం రెండో అంశం అట. అంటే 8 జట్లు, 2 గ్రూప్లు, 4 ప్లేఆఫ్స్లు అన్నమాట.


Click it and Unblock the Notifications
