హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్-పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరిగేలా భారత్ను ఒప్పించే సత్తా ఐసీసీకి లేదని వసీం అక్రమ్ విమర్శించాడు. దీని ఫలితంగా భారత్-పాక్ యువ క్రికెటర్లు ఒకరితో ఒకరు ఆడలేకపోతున్నారని అన్నాడు.
అంతేకాదు ఇరు దేశాలకు చెందిన క్రీడా సంబంధాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐని శాసించే సత్తా ఐసీసీకి లేదనడానికి ఇదే ఒక ఉదాహరణ అని అక్రమ్ మండిపడ్డాడు. 'పాకిస్థాన్తో సిరీస్లో తలపడేందుకు భారత్ను ఒప్పించే శక్తి ఐసీసీకి ఉందని అనుకోవడం లేదు. క్రీడలను, రాజకీయాలను వేర్వేరుగా చూడాలి' అని అక్రమ్ అన్నాడు.

'ఇరు దేశాల ఆటగాళ్లు పరస్పరం తలపడటం ఎంతో ముఖ్యం. బీసీసీఐని ఐసీసీ ఒప్పించడంలో విఫలమవుతుంది. భారత్-పాక్ పోరంటే యాషెస్ను మించింది. యాషెస్ను 20 లక్షల మంది మాత్రమే చూస్తే... భారత్-పాక్ మ్యాచ్ను వందల కోట్ల మంది ఎంతో ఆసక్తితో తిలకిస్తారు' అని అక్రమ్ అన్నాడు.
పాక్తో ఆడడం భారత్కు ఇష్టం లేకపోతే వారిని బలవంతం చేయలేం కదా అని అక్రమ్ అన్నాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు చివరిసారిగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.
ఇదిలా ఉంటే గతంలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఎన్నో అద్భుతమైన మ్యాచ్లకు వసీం అక్రమ్ సాక్ష్యంగా నిలిచాడు. పాకిస్థాన్ తరుపున 104 టెస్టులు, 356 వన్డేలాడిన అక్రమ్ టెస్టుల్లో 414, వన్డేల్లో 502 వికెట్లు తీశాడు. అంతేకాదు టెస్టుల్లో మూడు సెంచరీలు కూడా నమోదు చేశాడు.