హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్తో పోల్చలేమని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం గిల్క్రిస్ట్ అన్నాడు. ఢిల్లీలో 'రాయల్ స్టాగ్ బారెల్ పర్ఫెక్ట్ స్ట్రోక్స్' కార్యక్రమానికి హాజరైన గిల్ క్రిస్ట్... కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు.
'కోహ్లీని పాంటింగ్తో పోల్చడం సరికాదు. సాధారణంగా ప్రతి విభాగంలో మనం ఆటగాళ్లను మాజీలతో పోలుస్తాం. కానీ, విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతన్ని చూసి భారత జట్టు స్ఫూర్తి పొందుతోంది. తద్వారా విజయాలు సాధిస్తోంది' అని గిల్ క్రిస్ట్ చెప్పాడు.

జట్టులో సమతుల్యంగా నడిపించే తెలివైన కెప్టెన్ ఉండటం ఎంతో గొప్ప విషయమని గిల్ క్రిస్ట్ అన్నాడు. 'కఠిన సమయంలోనూ కోహ్లీ సమర్థవంతంగా జట్టును నడిపిస్తున్నాడు. జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. అతను జట్టును నడిపించే తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంటోంది' అని గిల్ క్రిస్ట్ చెప్పాడు.
ప్రస్తుతం కోహ్లీసేన బలంగా ఉందని, సొంతగడ్డపై ఆడే అన్ని సిరీస్ల్లోనూ వరుస విజయాలు సాధిస్తోందని అన్నాడు. 'భారత జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు, పేస్ బౌలర్లు ఉన్నారు. అంతేకాదు బ్యాటింగ్ ఆర్డర్ కూడా బాగుంది. విదేశాల్లో ఎలా రాణిస్తారన్నది చూడాలి. త్వరలో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఏం జరగుతుందో చూడాలి' అని గిల్ క్రిస్ట్ చెప్పాడు.