
మెల్బోర్న్: స్వదేశంలో భారత్తో జరగబోయే టెస్టు సిరీస్ కోసం 17 మంది సభ్యుల జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) గురువారం ప్రకటించింది. టిమ్ పైన్ కెప్టెన్సీలోని ఆసీస్ జట్టు భారత్తో తలపడనుంది. యువ ఆటగాళ్లు విల్ పకోవ్స్కీ (22), కెమెరాన్ గ్రీన్లను తొలిసారి టెస్ట్ సిరీస్కు ఎంపిక చేశారు. అన్క్యాప్డ్ ప్లేయర్లు ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్, లెగ్స్పిన్నర్ మిచెల్ వెప్సన్, ఆల్రౌండర్ మిఖైల్ నీజర్లకు చోటు దక్కింది. ఈ ఐదుగురు ఆటగాళ్లు షీఫెల్డ్ షీల్డ్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన చేశారు.
ఈ సీజన్లో విక్టోరియా జట్టు విల్ పకోవ్స్కీని ఓపెనర్గా ప్రమోట్ చేయగా.. మూడు ఇన్నింగ్స్ల్లోనే 495 రన్స్ చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. విక్టోరియాకు చెందిన పకోవ్స్కీ ఓవరాల్గా 22 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 55.48 సగటుతో అతను 1720 పరుగులు సాధించాడు. పకోవ్స్కీకి జాతీయ జట్టులో ఆడే అవకాశం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్తో పాటు అతను ఓపెనర్గా ఆడే అవకాశం ఉంది.
విల్ పకోవ్స్కీని టెస్ట్ తుది జట్టులోకి తీసుకునే ముందు క్రికెట్ ఆస్ట్రేలియా.. డేవిడ్ వార్నర్ను సంప్రదించనుంది. వార్నర్ ఓకే చెబితేనే పకోవ్స్కీకి ఆడే అవకాశం దక్కనుంది. గత కొంత కాలంగా వార్నర్, జో బర్న్స్ ఓపెనర్లుగా ఆడుతున్నారు. వీరిద్దరూ 27 ఇన్నింగ్స్ల్లో 50.55 యావరేజ్తో పరుగులు చేశారు. పకోవ్స్కీని ఆడించాలంటే జోను పక్కనబెట్టాల్సి ఉంటుంది. దీంతో ఓపెనింగ్ జోడి మార్పు విషయమై మేనేజ్మెంట్ వార్నర్ను సంప్రదించనుంది. వార్నర్కు కొత్త ఓపెనర్తో సౌకర్యంగా ఉంటుందో లేదో కనుక్కోనుంది. వార్నర్ ఓకే చెబితే.. అతడు తొలిసారి ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్ ఆడనున్నాడు. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 17నుంచి అడిలైడ్లో తొలి టెస్టు జరుగుతుంది.
ఆస్ట్రేలియా టీమ్:
టిమ్ పైన్ (కెప్టెన్), సీన్ అబాట్, జో బర్న్స్, పాట్ కమిన్స్, కెమెరాన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మైఖేల్ నీజర్, జేమ్స్ పాటిన్సన్, విల్ పుకోస్కీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ వెప్సన్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్.