ముంబై: టీమిండియాకు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. గంగూలీని టీమిండియా హెడ్ కోచ్గా లేదా డైరెక్టర్గా ఏ పదవిలో నియమించినా గంగూలీ పూర్తి న్యాయం చేస్తాడని అన్నారు.
ప్రధాన కోచ్గా డంకన్ ఫ్లెచర్ పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో కొత్త కోచ్ను నియమించేందుకు బీసీసీఐ అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పదవికి గంగూలీ, రాహుల్ ద్రవిడ్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ టీమిండియా కోచ్ పదవికి గంగూలీయే ఉత్తమని అన్నారు.
'భారత్ ఆడబోయే మ్యాచ్లు ఎక్కువగా స్వదేశంలో, ఉపఖండంలో ఉన్నాయి. టీమిండియా కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు ఇదే సరైన సమయం. ఈ పదవిలో గంగూలీని నియమిస్తే జట్టును సమర్థవంతంగా నడిపిస్తాడు. దాదా కోచ్ అయితే జట్టుకు ఇతర కోచ్ల అవసరం ఉండదు' అని గవాస్కర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

టీమిండియా కోచ్ రేసులో ఆస్ర్టేలియా మాజీ ఆటగాడు జస్టిన్ లాంగర్తోపాటు ఇంగ్లండ్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్ పేర్లు కూడా తెరపైకొచ్చాయి. ఏదేమైనా బోర్డు నియమించిన నిపుణుల కమిటీ కోచ్ నియామకంపై ఒక నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటు విదేశాల్లో విజయాలు సాధించడమే లక్ష్యంగా బీసీసీఐ పెట్టుకుంది.
అందుకోసం జట్టులోని సహాయక సిబ్బందిని కూడా బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉంది. అందుకోసం గంగూలీని డైరెక్టర్ను చేసి అతని సమకాలీనులైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్లకు కూడా వారి సామర్థ్యాన్ని బట్టి కీలక బాధ్యతలు అప్పగించాలనేది బీసీసీఐ ఆలోచనగా తెలుస్తోంది.