న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీ కోసం భారత జట్టు ఎంపికపై బిసిసిఐ సెలక్షన్ కమిటీ భారీ కసరత్తు చేయాల్సి వస్తోంది. ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలో తేల్చుకోలేకపోతున్నారు.
బ్యాట్స్మెన్లలో అజింక్యా రహానే, మనీష్ పాండే, ఆల్ రౌండర్లలో రవీంద్ జడేజా, అశ్విన్కు హర్భజన్ సింగ్, పవన్ నేగి తీవ్ర పోటీ నెలకొంది. గత కొంతకాలంగా టీమిండియాకు దూరమైన ఇర్ఫాన్ పఠాన్ తాజాగా ఈ టోర్నీ కోసం తీసుకోవాలని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బరోడా జట్టును ఫైనల్కు చేర్చిన కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్.. టీమిండియాలోకి పునరాగమనం చేసే అవకాశం ఉందని భారత్ వన్డే, టీ20 కెప్టెన్ ధోని వెల్లడించాడు. శ్రీలంకతో ఫిబ్రవరి 9 నుంచి జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్తో ఆసియా, టీ20 ప్రపంచకప్లో బరిలోకి దిగే జట్టుపై ఓ అవగాహన వస్తుందన్నాడు.

మెగా టోర్నీలో పేసర్ ఆశిష్ నెహ్రాకు గాయం లేదా విశ్రాంతి అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయంగా మరో ఎడమచేతి వాటం పేసర్ ఇర్ఫాన్ పఠాన్ను జట్టులో చేర్చుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నాడు. అలాగే స్పిన్నర్ రవీంద్ర జడేజాకి పవన్ నేగి, అశ్విన్కు హర్భజన్ సింగ్ను ప్రత్యామ్నాయంగా ఎంచుకోగా.. అక్షర్ పటేల్ ఆశించిన మేర రాణించడం లేదన్నాడు.
పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరాడని వివరించిన ధోనీ, ఇప్పటికే శ్రీలంకతో తలపడే తుదిజట్టులో ఇర్ఫాన్ పఠాన్కు చోటు దక్కకపోయినా మెగా టోర్నీల్లో నేరుగా అవకాశమివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలిపాడు. కాగా, ఇర్ఫాన్ పఠాన్ తన చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ అక్టోబరు 2, 2012లో దక్షిణాఫ్రికాపై ఆడాడు.
ఇది ఇలా ఉండగా, టీ20 ప్రపంచ కప్ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీల స్థానం ఖరారైపోయింది. రహానేను ఈ జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 15మంది ఆటగాళ్లు ఉండే ఈ జట్టులో మిగితా ఆటగాళ్ల ఎంపిక పూర్తి చేసి శుక్రవారం బిసిసిఐ సెలక్టర్లు వెల్లడించనున్నారు.