న్యూఢిల్లీ: భారత్లో వచ్చే నెలలో జరగనున్న ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్లో పాకిస్థాన్ పాల్గొనే అంశంపై వారంలో స్పష్టత రానుంది. టోర్నీలో పాల్గొనే అంశంపై తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) గురువారం తెలిపింది.
పీసీబీ మీడియా డైరెక్టర్ గురువారం మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం తర్వాత మాత్రమే తాము ఒక స్పష్టతకు రాగలమని గురువారం పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు భారత్లో క్రికెట్ ఆడేందుకు ఏ దేశం కూడా భయపడాల్సిన అవసరం లేదని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏ దేశమైనా భారత్లో ఆడటం ఇష్టం లేకపోతే ఐసీసీకి తమ నిర్ణయం తెలపొచ్చని, తాము మాత్రం టీ20లో పాల్గొనే అన్ని జట్లకు పటిష్ట భద్రత కల్పిస్తామని ఠాకూర్ చెప్పిన నేపథ్యంలో పీసీబీ పైవిధంగా స్పందించింది.

భారత్లో జరిగే టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్ పాల్గొనడానికి సంశయం వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగానే గౌహతిలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో పాల్గొనే పాకిస్థాన్ ఆటగాళ్లకు తోడుగా క్రికెట్ వ్యక్తులను పంపించింది. భారత్పై ఇటీవల జరిగిన పఠాన్ కోట్ దాడులే ఇందుకు కారణమంటున్నారు.
ఇందులో భాగంగానే తమ జట్టు భారత్లో పర్యటిస్తే దాడులకు గురయ్యే అవకాశం ఉందని పీసీబీ భావిస్తోంది. అదే విషయాన్ని ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దృష్టికి కూడా తీసుకెళ్లింది. పాక్ జట్టుభారత్లో పర్యటించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాతే పీసీబీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.