కోల్కత్తా: వరల్డ్ టీ20 క్రికెట్లో వెస్టిండిస్ రెండోసారి ప్రపంచకప్ కైవసం చేసుకుంది. 2012లో శ్రీలంకకు షాకిచ్చిన వెస్టిండిస్ ఈసారి ఇంగ్లాండ్కు దిమ్మదిరిగే ఝలక్ ఇచ్చింది. ఆదివారం అనూహ్య మలుపులు తిరుగుతూ ఉత్కంఠభరితంగా సాగిన వరల్డ్ కప్ ఫైనల్లో వెస్టిండిస్ జట్టు 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది.
156 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన వెస్టిండిస్ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ పైనల్లో విజయం సాధించి వరల్డ్ టీ20లో ఛాంపియన్గా అవతరించింది. క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతూ.. ఇంగ్లాండ్ను చిత్తు చేసి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.
చివరి ఓవర్లో వెస్టిండిస్ జట్టు ఆటగాడు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ బ్రాత్వైట్ స్టోక్స్ బౌలింగ్లో వరుసగా 6, 6, 6, 6 సిక్స్లు బాది వెస్టిండిస్కు విజయం అందించాడు. దీంతో వరల్డ్ టీ20 టోర్నమెంట్లో ఆ జట్టు ఛాంపియన్గా అవతరించింది.

ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ విశేషాలు:
* ఐసీసీ వరల్డ్ టీ20 వరల్డ్ కప్ను 2 సార్లు గెలిచిన తొలి జట్టుగా వెస్టిండిస్ రికార్డు సృష్టించింది.
* ఒకే ఏడాది అండర్-19, మహిళలు, పురుషుల విభాగాల్లో వరల్డ్ కప్ సాధించిన తొలి దేశంగా వెస్టిండీస్ మరో రికార్డు సాధించింది.
* ఫైనల్ మ్యాచ్లో శామ్యూల్స్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గా ఎంపికయ్యాడు. 2012లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కూడా ఇతనే ఈ అవార్డు సాధించాడు.
* 2012 వరల్డ్ కప్లో వెస్టిండిస్ ఛాంపియన్గా అవతరించడంలో శామ్యూల్స్ కీలకపాత్ర పోషించాడు.
* తద్వారా వరల్డీ టీ20 ఫైనల్ విజేత జట్టులో రెండుసార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెల్చుకున్న తొలి క్రికెటర్గా శామ్యూల్స్ ఘనత సాధించాడు.
* టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అర్ధ సెంచరీ చేసిన తర్వాత వికెట్ తీసిన మూడో బౌలర్గా జో రూట్ నిలిచాడు.
* టీ20 ఫార్మెట్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన ఐదో బ్యాట్స్మన్ బ్రాత్ వైట్.
* టీ20ల్లో వెస్టిండిస్ కెప్టెన్ డారెన్ సామీ వరుసగా టాస్ గెలవడం పదోసారి.
* ఈ ఫార్మాట్లో అత్యధికసార్లు వరుసగా టాస్ గెలిచిన తొలి కెప్టెన్ అతనే.
* టీ20 మ్యాచ్ లక్ష్యఛేదనలో చివరి ఓవర్లో అత్యధిక పరుగులు చేయడం ఇదే తొలిసారి.
* చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా, బ్రాత్ వైట్ వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు.
* టీ20 క్రికెట్లో 50 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన నాలుగో విండీస్ క్రికెటర్ క్రిస్గేల్.
* ఈ టోర్నీలో బ్యాటింగ్ అద్భుతంగా రాణించిన టీమిండియా యువ బ్యాట్స్మెన్ కోహ్లీ 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ 'గా ఎంపికయ్యాడు.
* టీ20 టోర్నీలో విరాట్ కోహ్లీ నాలుగోసారి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు.