మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్కప్
మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్కప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్కప్లో టీమిండియా విజయావకాశాలపై యువరాజ్ స్పందించాడు. యువీ మాట్లాడుతూ "ఈ వరల్డ్కప్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో నలుగురు ఫీల్డర్లు సర్కిల్ (30గజాలు)లో ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య ఐదుగురు ఫీల్డర్లకు చేరింది" అని అన్నాడు.
260 నుంచి 280 పరుగులు చేస్తే
"తద్వారా అప్పట్లో 260 నుంచి 280 పరుగులు చేస్తే పోరాడే అవకాశం లభించేంది. ఇప్పుడు ఫీల్డింగ్లో మార్పుల వల్ల 300పైగా స్కోర్ సాధించినా ప్రత్యర్థులు ఛేదిస్తున్నారు. నాకైతే మన జట్టుపై పూర్తి నమ్మకం ఉంది. ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించగలరు. గత రెండు మూడేళ్లుగా టీమిండియా బాగా ఆడుతోంది" అని యువరాజ్ అన్నాడు.
వరల్డ్కప్ పైనల్కు చేరేది వీళ్లే
"ఇంగ్లాండ్, ఇండియా వరల్డ్కప్ పైనల్కు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక, ఆస్ట్రేలియా విషయానికి వస్తే డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ రాకతో ఆ జట్టు బలంగా ఉంది. ఆసీస్కు మంచి బౌలింగ్ ఎటాక్ ఉంది. ఈ మూడు జట్లు సెమీఫైనల్కు చేరే నాలుగు జట్లలో తప్పక ఉంటాయి" అని యువరాజ్ తెలిపాడు.
హార్దిక్ పాండ్యా కీలకం
ఈ వరల్డ్ కప్ జట్టులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా భారత జట్టు విజయాల్లో కీలక ఆటగాడు అవుతాడని యువీ తెలిపాడు. "రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇదొక చక్కటి టోర్నమెంట్. అయితే, ఎక్స్-ప్యాక్టర్ విషయానికి వస్తే మాత్రం హార్దిక్ పాండ్యానే. ప్రస్తుతం అతడు మంచి ఫామ్లో ఉన్నాడు. బ్యాట్తో పాటు బంతితో రాణిస్తున్నాడు" అని యువీ చెప్పాడు.
ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో
"ఇంగ్లాండ్ పిచ్లపై ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే, పాండ్యా మూడో పేస్ బౌలర్గా పనికొస్తాడు. ఈ కాంబినేషన్ జట్టులో సమతుల్యాన్ని తీసుకు వస్తుంది. గతంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే ఫార్ములా అనుసకరించిందని యువీ ఈ సందర్భంగా గుర్తుచేశాడు.