హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వన్డే వరల్డ్కప్లో మరో హ్యాట్రిక్ సాధిస్తానని శ్రీలంక సీనియర్ పేసర్ లసిత్ మలింగ ధీమా వ్యక్తం చేశాడు. 2007 వరల్డ్కప్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి అరుదైన రికార్డుని మలింగ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అంతేకాదు ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీల్లో రెండుసార్లు హ్యాట్రిక్ సాధించిన ఏకైక ఆటగాడు కూడా మలింగానే. తాజాగా, వరల్డ్కప్ నేపథ్యంలో మలింగ ఐసీసీ మీడియాతో మాట్లాడుతూ "ఈ వరల్డ్కప్లో మరో హ్యాట్రిక్ ఎందుకు తీయకూడదు. ఏదైనా ప్రత్యేకంగా ప్రయత్నించాలని అనుకుంటున్నా" అని అన్నాడు.
"ఇంగ్లాండ్లో ఆడే సమయంలో అక్కడి పరిస్థితులకు తగ్గట్లు అలవాటు పడాలి. అక్కడ బాగా వేడిగా ఉండొచ్చు.. లేదా విపరీతంగా చలి పెట్టవచ్చు. కాబటి ఒక బౌలర్గా ఇంగ్లండ్లో ఆడటం నిజంగా ఓ పరీక్ష'' అని మలింగ తెలిపాడు. ఈ టోర్నీలో మలింగ ఇంకో వికెట్ తీస్తే ఆల్ టైమ్ టాప్-10 జాబితాలో చేరతాడు.
దీంతో పాటు వన్డేల్లో శ్రీలంక తరుపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో సనత్ జయసూర్య(323 వికెట్లు) సరసన నిలుస్తాడు. ఐపీఎల్ 12వ సీజన్లో ఆడటం తనకు ఎంతో ఉపయోగపడిందని లసిత్ మలింగ చెప్పుకొచ్చాడు. "వికెట్లు తీయడంలో నేను ఎప్పుడూ వెనకాడను. ఐపీఎల్ 12వ సీజన్ చాలా విజయవంతంగా ముగిసింది" అని అన్నాడు.
"ఐపీఎల్ వల్లే నాకు గట్టి నమ్మకం ఏర్పడింది. కానీ ఇంగ్లండ్లో పరిస్థితులతో పాటు ఆడే ఫార్మాట్ రెండు వేరు. అయితే, వికెట్లు తీయగలుగుతాననే నమ్మకం ఉంది" అని లసిత్ మలింగ తెలిపాడు. ప్రస్తుతం శ్రీలంక జట్టులో ఉన్న యువ క్రికెటర్లు తమ ప్రతిభ నిరూపించుకోవాలని సిద్ధంగా ఉన్నారని మలింగ తెలిపాడు.
"మా జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. కానీ, ఈ యువ క్రికెటర్లు చాలా ప్రతిభావంతులు. వాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోనేందుకు ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. జట్టులో 15 మంది కూడా అత్యుత్తమ ఆటగాళ్లే. ప్రస్తుతం జట్టులో అనుభవంతో పాటు యువ క్రికెటర్లు ఉన్నారు" అని మలింగ పేర్కొన్నాడు.