
హైదరాబాద్: వరల్డ్కప్కు ముందు జరిగిన సన్నాహాక మ్యాచ్ల్లో నిరాశపరిచిన టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఫామ్పై ఎటువంటి ఆందోళన లేదని కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్తో ఓవల్ వేదికగా జరిగిన తొలి వార్మప్ మ్యాచ్లో నిరాశ పరిచిన ఓపెనర్లు... కార్ఢిప్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్లోనూ రాణించలేదు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ధావన్ కేవలం 1 పరుగుకే పెవిలియన్కు చేరగా... మరో ఓపెనర్ రోహిత్ శర్మ 42 బంతులాడి కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఇలా రెండు వార్మప్ మ్యాచ్ల్లోనూ పేలవ ప్రదర్శన చేసిన ఓపెనర్లను కెప్టెన్ కోహ్లీ వెనుకేసుకొచ్చాడు. బంగ్లాతో మ్యాచ్ అనంతరం కోహ్లీ ఓపెనర్ల ప్రదర్శన తనను నిరాశపరచలేదని తెలిపాడు.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో ఆడిన విధానం టీమిండియాకు అత్యంత శుభపరిణామం. అందరికీ జట్టులో వారివారి పాత్రలేంటో తెలుసు. కేఎల్ రాహుల్ పరుగులు చేయడం చాలా కీలకం. ధోనీ, హార్దిక్ పాండ్యా అద్భుతంగా ఆడారు. రెండు వార్మప్ తొలుత బ్యాటింగ్ చేయడం నిజంగా సవాలే" అని అన్నాడు.
"శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు మంచి ఆటగాళ్లు. ఐసీసీ ఈవెంట్లలో వాళ్లు స్టార్ ఆటగాళ్లు. నిజానికి ఈ మ్యాచ్లో ఛేదన చేయాలనుకున్నాం. వన్డే ఫార్మాట్లో కుదురుకోవడానికి వెంటనే వీలుపడదు. రెండో వార్మప్ బంగ్లా బ్యాట్స్మెన్ నుంచి మాకు సవాళ్లు ఎదురయ్యాయి. మేం చక్కగా బౌలింగ్ చేశాం. స్పిన్నర్లు వికెట్లు తీశారు. బుమ్రా కీలకంగా నిలిచాడు" అని కోహ్లీ చెప్పాడు.
బంగ్లాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో ధోని 78 బంతుల్లో 113 పరుగులు, కేఎల్ రాహుల్ 99 బంతుల్లో 108(12 ఫోర్లు, 4 సిక్సులు) కూడా సెంచరీతో చెలరేగడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 359 పరుగులు చేసింది. 360 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 49.3 ఓవర్లలో 264 పరుగులకే ఆలౌటైంది.
దీంతో భారత్ 95 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. టోర్నీలో భాగంగా ఆరంభ మ్యాచ్లో ఆతథ్య ఇంగ్లాండ్.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్కి లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదిక కానుంది. ఇక, కోహ్లీసేన సౌతాంప్టన్ వేదికగా జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.