
అందుకే ఇంగ్లాండ్లోనే ఉంచాం
"ప్రస్తుతానికి జట్టుకు అతడి సేవలు అవసరం. అందుకే ఇంగ్లాండ్లోనే ఉంచాం. ధావన్ కూడా ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. గాయం తీవ్రత ఎలా ఉన్నా తాను మాత్రం మ్యాచ్లు ఆడేందుకు ఉత్సాహాన్ని కనబరుస్తున్నాడు" అని కోహ్లీ పేర్కొన్నాడు. కాగా, గాయం నుంచి కోలుకున్నా స్లిప్లో ఫీల్డింగ్ చేయడం ధావన్కు పెద్ద సవాల్ అని ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ అన్నాడు.

ధావన్కు ఫీల్డింగ్ చేయడం ఏమంత కష్టం కాదు
"గాయం నుంచి కోలుకున్న తర్వాత ధావన్కు ఫీల్డింగ్ చేయడం ఏమంత కష్టం కాదు. కానీ బంతి వేగంగా దూసుకొచ్చే స్లిప్లో ఫీల్డింగ్ చేయడం మాత్రం కచ్చితంగా అతడికి పెద్ద సవాలే. అతనికి స్లిప్లో ఫీల్డింగ్ చేయడమే అలవాటు. ప్రస్తుతం అతన్ని తక్కువ బరువు ఉన్న బంతులతో పరీక్షించాలి. ఆ తర్వాత క్రికెట్ బంతికి వెళ్లాలి మరో పది, పన్నెండు రోజుల్లో శిఖర్ ఫిట్నెస్ను పరీక్షిస్తాం" అని శ్రీధర్ అన్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ధావన్కు గాయం
గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో గాయపడ్డ శిఖర్ ధావన్కు జట్టు యాజమాన్యం మంగళవారం స్కానింగ్ చేయించింది. దీంతో అతడి వేలి ఎముక చిట్లినట్టు తేలింది. గాయం తీవ్రత దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో అతడు సుమారు మూడు వారాల పాటు టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది.

ధావన్ ఇంగ్లాండ్లోనే ఉండేందుకు
ధావన్ ఇంగ్లాండ్లోనే ఉండేందుకు మెడికల్ టీమ్ అనుమతిచ్చిందని బీసీసీఐ తెలిపింది. అతడిని ఇంగ్లాండ్లోనే ఉంచి చికిత్స అందిస్తోంది. అతడి స్థానంలో వేరొక ఆటగాడిని బీసీసీఐ ఎంపిక చేయలేదు. ఐసీసీ నిబంధన ప్రకారం గాయపడ్డ ఆటగాడి స్థానంలో మరొకరిని తీసుకుంటే.. ఆ ఆటగాడు మళ్లీ కోలుకున్నప్పటికీ అతడిని జట్టులోకి తిరిగి రావడానికి వీల్లేదు.

గాయపడ్డ ఆటగాడి స్థానంలో ఎంపికైన ఆటగాడిని
గాయపడ్డ ఆటగాడి స్థానంలో ఎంపికైన ఆటగాడిని తప్పించి, పాత ఆటగాడిని ఎంచుకోవడానికి ఐసీసీ నిబంధనలు ఒప్పుకోవు. కనీసం మూడు మ్యాచ్లకు ధావన్ దూరమవుతాడని వైద్యులు అంచనా వేస్తున్నారు. టోర్నీలో భాగంగా కోహ్లీసేన ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో రోహిత్కు ధావన్ స్థానంలో ఓపెనర్గా కేఎల్ రాహుల్ బరిలోకి దిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












