
హైదరాబాద్: ప్రపంచకప్లో భాగంగా టీమిండియా ఆదివారం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో తలపడే మ్యాచ్లో ధరించనున్న ఆరెంజ్ జెర్సీపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్లో టీమిండియా ధరించే అరెంజ్ జెర్సీని నైకీ శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఆరెంజ్ కలర్ జెర్సీని బీసీసీఐ సైతం తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ముందు భాగంలో ముదురు నీలం రంగు... భుజాలు, వెనక భాగం పూర్తిగా ఆరెంజ్ కలర్తో కనిపించేలా ఈ జెర్సీని డిజైన్ చేసారు. ఈ డిజైన్పై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు వేస్తున్నారు.
స్విగ్గీ స్పూర్తితో సరిగ్గా అలాంటి జెర్సీనే రూపొందించినందుకు దానికి తప్పకుండా క్రెడిట్ ఇవ్వాలని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా... అచ్చం హార్లిక్స్ డబ్బా రంగుని పోలి ఉందని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొందరు అయితే టీమిండియా జెర్సీ బాగుందని, రాబోయే రోజుల్లో కూడా దీనినే కొనసాగించాలంటున్నారు.
కోహ్లీసేన ఆరెంజ్ కలర్ జెర్సీలు వేసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఆరెంజ్ కలర్ జెర్సీలో టీమిండియా ప్లేయర్లు కొత్తగా కనిపిస్తున్నారు. నిజానికి ఈ ఆరెంజ్ కలర్ జెర్సీ ఎలా ఉంటుందోనని అభిమానులు ఆందోళన చెందారు. ఆరెంజ్, నీలి రంగు కాంబినేషన్లో కొత్త డ్రెస్ చాలా బాగుంది.
ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జట్టు అధికారిక స్పాన్సర్ నైకీ సంస్థ ఈ జెర్సీకి రూపకల్పన చేసింది. తేలికపాటిగా, శరీరంపై చెమట త్వరగా ఆరిపోయేలా సౌకర్యవంతంగా జెర్సీని డిజైన్ చేశారు. ఇన్నాళ్లు నీలి రంగుకు అలవాటు పడ్డ అభిమానులకు టీమిండియా ఆరెంజ్ జెర్సీలో అలరించనుంది.
చాహల్, షమీ, రాహుల్ కొత్త జెర్సీలు ధరించి ఫొటోలను భారత క్రికెట్ జట్టు ఇనిస్టాగ్రామ్లో అభిమానుల కోసం బీసీసీఐ షేర్ చేసింది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో ఐసీసీ నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశం మినహాయించి ప్రతి జట్టు రెండు రంగుల కిట్ల వివరాల్ని అందజేయాలి.
రెండు జట్ల జెర్సీల రంగు ఒకే విధంగా ఉన్నప్పుడు అందులో ఒక జట్టు.. వేరే రంగు జెర్సీని ధరించాలి. ఇంగ్లాండ్, ఇండియా దేశాలకు చెందిన జట్ల జెర్సీలు నీలి రంగులో ఉండటంతో మ్యాచ్ వీక్షించేటప్పుడు అభిమానులు, అంపైర్లు, మైదానంలోని ఆటగాళ్లు కూడా గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. దీంతో హోమ్.. అవే విధానంలో ఆతిథ్య జట్టు ధరించే జెర్సీలో ఎలాంటి మార్పు ఉండదు.