
హైదరాబాద్: ఓవల్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా ఈ ప్రపంచకప్లో సెంచరీ బాదిన తొలి కెప్టెన్గా అరోన్ ఫించ్ నిలిచాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత ఆస్ట్రేలియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ఆరోన్ ఫించ్ ఆ తర్వాత దూకుడుగా ఆడి 98 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
శ్రీలంక బౌలర్ సిరివర్థనే వేసిన 33 ఓవర్ రెండో బంతిని సిక్స్గా మలచి ఆరోన్ ఫించ్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో ఫించ్కు ఇది 14వ సెంచరీ. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన ఆసీస్ ఓపెనర్లు ఆ తర్వాత జోరు పెంచి దూకుడుగా ఆడారు. డేవిడ్ వార్నర్ నిదానంగా ఆడుతుంటే ఫించ్ మాత్రం లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డుని ముందుకు నడిపించాడు.
వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 80 పరుగులు జోడించిన తర్వాత డేవిడ్ వార్నర్ 48 బంతుల్లో 26(2 ఫోర్లు) ధనుంజయ డిసిల్వా బౌలింగ్లో ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా(10) జట్టు స్కోరు 100 పరుగుల వద్ద ధనుంజయ డిసిల్వా బౌలింగ్లో ఉదానకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
ఈ తరుణంలో ఫించ్కు జత కలిసిన స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ నిలకడగా ఆడి వందకుపైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ కూడా హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 40 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. ఆసీస్ కోల్పోయిన తొలి రెండు వికెట్లు ధనంజయ డిసిల్వానే పడగొట్టాడు.