
హైదరాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ వరల్డ్కప్కు సంబంధించి షెడ్యూల్లో చిన్న మార్పు జరిగింది. టోర్నీలో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ జూన్ 2 జరగాల్సి ఉంటే, దానిని జూన్ 4వ తేదీకి మర్చారు.
ఈ మార్పునకు కారణం జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల మేరకు ఐపీఎల్ ఫైనల్కు, అంతర్జాతీయ మ్యాచ్కు మధ్య కనీసం 15 రోజుల సమయం కచ్చితంగా ఉండాలి. కోల్కతాలో మంగళవారం జరిగిన ఐసీసీ సీఈఓల మీటింగ్లో దీనిపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
2019 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి జులై 14 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ మార్చి 29 నుంచి మే 19 వరకు జరగనుంది. దీంతో 15 రోజుల నిబంధన మేరకు జూన్ 4నే తొలి మ్యాచ్ ఆడే వీలుంటుందని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.
టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ షెడ్యూల్లో మార్పుకు ఐసీసీ సీఈసీ కూడా అంగీకరించింది. దీనిని ఐసీసీ బోర్డుకు సిఫారసు చేశామని ఆ అధికారి వెల్లడించారు. గతంలో వరల్డ్ కప్ లాంటి పెద్ద ఈవెంట్లను భారత్-పాకిస్థాన్ మ్యాచ్తో ఐసీసీ ప్రారంభించేది.
2015 వరల్డ్కప్(అడిలైడ్), 2017 చాంపియన్స్ ట్రోఫీ(బర్మింగ్ హామ్) ఇలాగే ప్రారంభమైంది. అయితే ఈసారి టోర్నీ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగనుందని ఆ అధికారి చెప్పారు. రౌండ్ రాబిన్ అంటే 1992 వరల్డ్కప్లో మాదిరిగా ఒక టీమ్ మిగతా అన్ని టీమ్స్తో ఆడాల్సి ఉంటుంది.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. 2019-23 మధ్య ఐదేళ్ల కాలానికి ఎఫ్టీపీని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ కాలంలో టీమిండియా మొత్తం 309 రోజుల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది. అయితే టెస్టు మ్యాచ్ల సంఖ్య 15 నుంచి 19కి పెరిగింది.
ఇవన్నీ కూడా టెస్టు చాంపియన్షిప్లో భాగంగా జరిగేవేనని ఐసీసీ స్పష్టం చేసింది. టెస్టు చాంపియన్షిప్లో ఆడే అన్ని మ్యాచ్లూ డే మ్యాచ్లే కావడం విశేషం.