
హైదరాబాద్: లీడ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. శ్రీలంక నిర్దేశించిన 265 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా మ్యాచ్ ఆరంభం నుంచే ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
వీరిద్దరూ శ్రీలంక బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నారు. పోటీలు పడి బౌండరీలు బాదుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగుతున్నారు. తొలుత రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో సాధించగా... ఆ తర్వాత కేఎల్ రాహుల్ సైతం హాఫ్ సెంచరీ సాధించాడు.
అద్భుత ఫామ్లో ఉన్న హిట్మ్యాన్ రోహిత్ శర్మ డిసిల్వ బౌలింగ్లో సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఇది ఆరో హాఫ్ సెంచరీ. అంతకముందు ఐదు హాఫ్ సెంచరీల్లో నాలుగింటిని సెంచరీలుగా మలిచాడు. దీంతో పాటు ఈ ప్రపంచకప్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడయ్యాడు.
ఇప్పటి వరకు 600కు పైగా పరుగులు చేసిన రోహిత్ 606 పరుగులతో అత్యధిక స్కోరర్గా ఉన్న షకీబల్ హసన్ను వెనక్కి నెట్టేశాడు. దీంతో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో ఈ హాఫ్ సెంచరీని కూడా సెంచరీగా మలచాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఆ తర్వాత కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ 23వ ఓవర్లో ఫోర్, సిక్స్ బాది హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ప్రపంచకప్లో కేఎల్ రాహుల్కు ఇది మూడో హాఫ్ సెంచరీ. వీరిద్దరూ దూకుడుగా ఆడుతుండటంతో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ప్రస్తుతం 24 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ కోల్పోకుండా 141 పరుగులు చేసింది.
క్రీజులో రోహిత్ శర్మ(78), కేఎల్ రాహుల్(61) పరుగులతో ఉన్నారు. అంతకముందు ఏంజెలో మాథ్యూస్ 128 బంతుల్లో 113(10 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీతో రాణించగా... లాహిరు తిరుమన్నే 68 బంతుల్లో 53(4 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది.
దీంతో టీమిండియాకు 265 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా... హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.