తొలి మ్యాచ్లో ఆడతాడు:
చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ... 'కేదార్ జాదవ్ ఫిట్నెస్ రిపోర్టులు వచ్చాయి. అతను పూర్తిగా కోలుకుని ఫిట్గా ఉన్నాడు. అతని రిపోర్టులతో సంతోషంగా ఉన్నాం. ప్రపంచకప్లో అతను ఆడతాడు. బుధవారం ఉదయం జట్టు సభ్యులతో పాటు జాదవ్ ఇంగ్లాండ్ వెళ్లనున్నాడు. కచ్చితంగా అతను దక్షిణాఫ్రికాతో జరిగే తొలి మ్యాచ్లో ఆడతాడు' అని ఎమ్మెస్కే తెలిపారు.
ఫీల్డింగ్ చేస్తుండగా గాయం:
అంతకుముందు గురువారం టీమిండియా ఫిజియో పాట్రిక్ ఫర్హార్ట్ ఆధ్వర్యంలో జాదవ్కి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించగా.. అతను ఫిట్గా ఉన్నట్లు తేలింది. ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా జాదవ్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. జాదవ్కు గాయం అవ్వడంతో అతని స్థానంలో అంబటి రాయుడు, అక్షర్ పటేల్ లకు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే జాదవ్ పూర్తిగా కోలుకోవడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి.
59 వన్డేలలో 1174 పరుగులు:
తాజాగా జరిగిన ఐపీఎల్లో కేదార్ జాదవ్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మంచి ప్రదర్శనే చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్న రెండు, మూడు మ్యాచులలో తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. మంచి ఫామ్ లో ఉన్న జాదవ్ ప్రపంచకప్లో మిడిలార్డర్ బ్యాట్స్మెన్గానే కాకుండా బౌలింగ్ పరంగా జట్టుకు ఉపయోగపడనున్నాడు. భారత్ తరపున జాదవ్ 59 వన్డేలలో 1174 పరుగులు చేసాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు 27 వికెట్లు కూడా తీసాడు.