

హైదరాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్కప్కు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే అభిమానులు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ మెగా టోర్నీకి సంబంధించి ఇప్పటికే టికెట్ల విక్రయం ప్రారంభం కాగా.. కేవలం 3500 టికెట్లు మాత్రమే మిగిలాయని బుధవారం ఐసీసీ తెలిపింది.
వన్డే ప్రపంచకప్ వచ్చే ఏడాది మే 30 నుంచి జులై 14 వరకు జరగనుంది. టోర్నీలో మొత్తం 48 మ్యాచ్లు జరగనున్నాయి. భారత్ ఆడబోయే అన్ని మ్యాచ్ల టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడుపోయానని ఐసీసీ ప్రకటించింది. జూన్ 16న ఓల్డ్ ట్రాఫోర్డ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్-భారత్ మధ్య జరిగే మ్యాచ్ టికెట్లు ఒక్కటి కూడా మిగల్లేదని ఐసీసీ పేర్కొంది.
మే 30న ఓవల్ వేదికగా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. జూలై 14న లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. "ప్రపంచకప్ మ్యాచ్లకు అందుబాటులో ఉన్న టిక్కెట్లన్నీ దాదాపుగా విక్రయించాం. ఇంకా సుమారు 3500 మాత్రమే మిగిలి ఉండొచ్చు. గతంలో కంటే ఈసారి టోర్నీకి విశేషాదరణ వస్తోంది" అని ఐసీసీ కమర్షియల్ విభాగం జనరల్ మేనేజర్ క్యాంప్బెల్ జేమిసన్ తెలిపారు.