
అసలేం జరిగింది?
టీమిండియా 46.4 ఓవర్లకు గాను 305/4 ఉన్న స్థితిలో వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో అంఫైర్లు మ్యాచ్ని నిలిపివేశారు. వర్షం వెలిసిన తర్వాత విరాట్ కోహ్లీ, విజయ్ శంకర్ తిరిగి క్రీజులోకి వచ్చారు. ఇన్నింగ్స్ 48 ఓవర్ను పాక్ పేసర్ మహ్మద్ ఆమీర్ అందుకున్నాడు. తొలి బంతికి విజయ్ శంకర్ పరుగులేమీ తీయకపోగా, రెండో బంతికి సింగిల్ తీశాడు.

స్టైకింగ్ ఎండ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ
దీంతో స్టైకింగ్ ఎండ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక, ఆమిర్ వేసిన నాలుగో బంతిని బౌన్సర్గా సంధించడంతో క్రీజులో ఉన్న కోహ్లీ పుల్ చేయబోగా అది కీపర్ చేతుల్లో పడింది. దీనిపై ఔట్కు సర్ఫరాజ్ బలంగా అప్పీల్ చేయకపోయినా, అంపైర్ నిర్ణయం ప్రకటించకుండానే కోహ్లీ వెంటనే తలవంచుకొని పెవిలియన్ వైపు బయల్దేరాడు.

కోహ్లీ బ్యాట్ బంతి తాకనే లేదు
అంపైర్ ఔట్గా కూడా ప్రకటించలేదు. రీప్లే చూస్తే కోహ్లీ బ్యాట్ బంతి తాకనే లేదని తేలింది. బ్యాట్ హ్యాండిల్ కాస్త వదులవడం వల్ల శబ్దం వచ్చి విరాట్ కోహ్లీ తాను ఔట్ అని భ్రమపడినట్లు తేలింది. పెవిలియన్కు చేరాక రీప్లే చూసుకుని విరాట్ కోహ్లీ అసహనం చెందడం మనకు కనిపించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి(77) ఐదో వికెట్గా ఔటయ్యాడు.

89 పరుగుల తేడాతో భారత్ విజయం
ఈ మ్యాచ్లో మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ ప్రపంచకప్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 244 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు భారత జట్టులో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.


Click it and Unblock the Notifications
