
లండన్: విశ్వక్రీడల్లో త్వరలో క్రికెట్ను చూడబోతున్నాం. లాస్ఏంజిల్స్ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ను భాగం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టే దిశగా ఐసీసీ వేగంగా చర్యలు తీసుకొంటోంది. లాస్ఏంజల్స్లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టు మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వరల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ మైక్ గ్యాటింగ్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇటీవల అంతర్జాతీయ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీ (వాడా) అనుబంధ జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (నాడా) పరిధిలోకి బీసీసీఐ రావడం కూడా ఒలింపిక్స్లో క్రికెట్ ప్రవేశానికి మార్గం సుగమమైందిని తెలుపుతోంది. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం అన్ని క్రీడా సమాఖ్యలు వాడా పరిధిలోకి రావాల్సి ఉంటుంది. ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టేందుకు చర్యలు వేగవంతం చేసినట్టు ఐసీసీ కొత్త సీఈవో మానూ సావ్నీ పేర్కొన్నట్టు ఎంసీసీ సమావేశం సందర్భంగా గ్యాటింగ్ తెలిపారు. 2024 ఒలింపిక్స్ పారిస్లో జరగనున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉన్న ఆటల్లో క్రికెట్ ఒకటి. అలాంటి క్రికెట్కు ఒలింపిక్స్లో మాత్రం చోటు దక్కలేదు. చివరిసారి 1900లో పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు లభించింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు 2028 ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు కల్పించాలని ఐసీసీ భావిస్తోంది. మొదటగా 2024 ఒలింపిక్స్లో చోటు కల్పించాలని భావించినా.. అది కుదరలేదు.