క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి క్రికెట్ మక్కాగా పిలవబడే ఇంగ్లండ్ ఆతిథ్యం ఇస్తోంది. 2026, జూన్ 12న ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్లో మొత్తం 12 అగ్రశ్రేణి జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. జూన్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగే హై-వోల్టేజ్ పోరుతో టీమిండియా తన ప్రపంచకప్ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించనుంది.
రెండు గ్రూపులుగా 12 జట్లు
ఈ టోర్నీలో పాల్గొనే 12 జట్లను ఐసీసీ రెండు గ్రూపులుగా విభజించింది. గ్రూప్ దశలో ప్రతి జట్టు ఐదు మ్యాచ్లు ఆడుతుంది. రెండు గ్రూపుల నుండి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు నేరుగా సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి.
గ్రూప్-A: ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్.
గ్రూప్-B: ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్.

టీమ్ ఇండియా పోరాటం.. కీలక మ్యాచ్ల వివరాలు
భారత జట్టు తన గ్రూప్ దశలో మొత్తం 5 మ్యాచ్లు ఆడనుంది. అన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకే ప్రారంభం కావడం విశేషం. తేదీ
జూన్ 14 -భారత్ vs పాకిస్థాన్-ఎడ్జ్బాస్టన్ వేదికగా సాయంత్రం 7:00 గంటలకు..
జూన్ 17-భారత్ vs నెదర్లాండ్స్ -హెడింగ్లీ వేదికగా సాయంత్రం 7:00 గంటలకు..
జూన్ 21-భారత్ vs దక్షిణాఫ్రికా-ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా సాయంత్రం 7:00 గంటలకు
జూన్ 25-భారత్ vs బంగ్లాదేశ్-ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా సాయంత్రం 7:00 గంటలకు..
జూన్ 28-భారత్ vs ఆస్ట్రేలియా- లార్డ్స్ వేదికగా సాయంత్రం 7:00 గంటలకు
నాకౌట్ దశ.. ఫైనల్ ముహూర్తం
టోర్నీ నాకౌట్ దశ జూన్ 30 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి సెమీఫైనల్ జూన్ 30న, రెండో సెమీఫైనల్ జులై 2న ప్రఖ్యాత 'ది ఓవల్' మైదానంలో నిర్వహిస్తారు. ఇక ప్రపంచ విజేత ఎవరో తేల్చే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ జూలై 5న చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్ జూన్ 12న ఇంగ్లండ్, శ్రీలంక మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా రాత్రి 11:00 గంటలకు జరగనుంది. ఈ మెగా టోర్నీలో భారత మహిళల జట్టు తొలిసారి ప్రపంచకప్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.