హైదరాబాద్: ఇంగ్లాండ్తో వరల్డ్ కప్ ఫైనల్లో తలపడుతున్న మిథాలీసేనకు కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా శుభాకాంక్షలు చెప్పింది. ఆదివారం లార్డ్స్ మైదానం వేదికగా ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఫైనల్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న కోహ్లీసేన ఆల్ ద బెస్ట్ చెప్పింది.
అంతేకాదు లార్డ్స్ మైదానంలో జరిగే మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా విజయం సాధించాలని కోహ్లీ సేన ఆకాంక్షించింది. దీనికి సంబంధించిన 13 సెకన్ల వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'శ్రీలంకలో ఉన్న భారత జట్టు, సహాయక సిబ్బంది తరఫున మహిళల జట్టుకు ఆల్ ది బెస్ట్' అని కెప్టెన్ కోహ్లీ చెప్పాడు.
ఇక పైనల్లో భారత మహిళల జట్టు విజయం సాధించాలని టీమిండియా కొత్త కోచ్ రవిశాస్త్రి కూడా ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలవలేదు. 2005లో దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన వరల్డ్ కప్ టోర్నీలో మిథాలీ రాజ్ సారథ్యంలోనే టీమిండియా తొలిసారి ఫైనల్కు చేరింది.
అయితే అప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై రన్నరప్గా నిలిచింది. ఇంగ్లాండ్ మాత్రం ఏడుసార్లు వరల్డ్ కప్ ఫైనల్కు చేరగా, మూడుసార్లు వరల్డ్ కప్ను (1973, 1993, 2009) గెలుచుకుంది. 2005లో తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్కు చేరిన భారత్.. మళ్లీ ఇప్పుడు ఫైనల్కు అర్హత సాధించింది. అప్పుడు, ఇప్పుడు మిథాలీనే టీమిండియాకు కెప్టెన్సీ వహిస్తుండటం విశేషం.
వరల్డ్ కప్లో ఈ రెండు జట్లు 10 సార్లు తలపడగా... భారత్ నాలుగు మ్యాచ్ల్లో, ఇంగ్లండ్ ఆరు మ్యాచ్ల్లో గెలిచాయి. లార్డ్స్ మైదానంలో ఈ రెండు జట్లు మూడుసార్లు తలపడగా... చెరో మ్యాచ్లో గెలిచాయి. మరో మ్యాచ్ రద్దు అయింది. కెప్టెన్ హోదాలో రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్న తొలి భారతీయ క్రికెటర్గా మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది.
టోర్నీలో లీగ్ దశలో ఇంగ్లాండ్ని అలవోకగా భారత్ ఓడించిన సంగతి తెలిసిందే. ఇక భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు జులై 26న ప్రారంభం కానుంది. శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య జట్టుతో 3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ20 ఆడనుంది.