హైదరాబాద్: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్లో మిథాలీ సేన వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ను చిత్తుచేసిన టీమిండియా టాంటన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో వెస్టిండిస్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలో 186 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. భారత బౌలర్లు పూనమ్ యాదవ్, హర్మన్ప్రీత్ , దీప్తి శర్మ తలో రెండు వికెట్లు తీసుకోగా, ఏక్తా బిస్త్ ఒక వికెట్ తీసింది.

అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. పరుగుల ఖాతా తెరవకముందే ఓపెనర్ పూనమ్ రౌత్ తొలి ఓవర్లోనే డకౌట్గా వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైంది.
దీంతో 33 పరుగులకే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మరో ఓపెనర్ స్మృతి మందన (106 నాటౌట్; 108 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సులు)తో రాణించి సెంచరీ నమోదు చేసింది. మరోవైపు కెప్టెన్ మిథాలీ రాజ్ నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించింది.

88 బంతుల్లో 3 ఫోర్లు సాయంతో 46 పరుగులు చేసిన మిథాల్ రాజ్ తృటిలో సెంచరీని మిస్ చేసుకుంది. చివర్లో మోనా మెశ్రమ్ 32 బంతుల్లో 18 నాటౌట్గా నిలిచి టీమిండియా గెలుపుని లాంఛనంగా పూర్తిచేసింది. ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన మందనను వరుసగా రెండో సారి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' సాధించింది. జులై 2న టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో డెర్బీ వేదికగా తలపడనుంది.
టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
ఐసీసీ మహిళల వరల్డ్ కప్లో భాగంగా భారత మహిళల జట్టు గురువారం వెస్టిండిస్తో తలపడుతుంది. టౌన్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా మిథాలీ సేన వెస్టిండిస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఆతిథ్య ఇంగ్లండ్తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా గెలిచి టోర్నీలో శుభారంభం చేసిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ మ్యాచ్లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్లో సమష్టి విజయం సాధించిన మిథాలీ సేన మరోసారి అదే ప్రదర్శన పునరావృతం చేయాలని చూస్తుండగా తొలి మ్యాచ్లో ఓటమిపాలైన వెస్టిండిస్ ఈ మ్యాచ్లో బోణీ కొట్టాలని చూస్తోంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఫేవరేట్గా బరిలోకి దిగుతుంది.

చివరగా వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో భారత జట్టు విజయం సాధించింది. వరుసగా నాలుగు సిరీస్ విజయాలతో ఈ వరల్డ్ కప్లోకి అడుగుపెట్టింది. ఓపెనర్లు స్మృతి మంధన, పూనమ్ రౌత్లతో పాటు టాపార్డర్లో మిథాలీరాజ్లతో కూడిన టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం.
మరోవైపు బౌలింగ్ విభాగంలో పేసర్ శిఖాపాండేతో పాటు స్పిన్నర్లు దీప్తి శర్మ, పూనమ్ యాదవ్లు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను సమర్థంగా కట్టడి చేస్తున్నారు. సెమీఫైనల్ లక్ష్యంగా పెట్టుకున్న మిథాలీ అండ్ కో ఇంగ్లండ్పై కనబరిచిన జోరును టోర్నీ ఆసాంతం కొనసాగించాలని భావిస్తోంది.
జట్ల వివరాలు:
టీమిండియా: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధన, పూనమ్ రౌత్, హర్మన్ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి, మోనా మేశ్రమ్, దీప్తి శర్మ, జులన్ గోస్వామి, శిఖా పాండే, ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్.
వెస్టిండిస్: స్టెఫానీ టేలర్ (కెప్టెన్), మెరిస్సా, రినిస్ బాయిస్, షమీలియా కానెల్, షానెల్ డెలీ, డియాం డ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్, క్వియానా జోసెఫ్, అనిసా మొహమ్మద్, ఫెలిసియా వాల్టర్స్, చెడియన్ నషన్.