
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా మహిళల టీ20 ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత ఎడంచేతి వాటం స్పిన్నర్ రాధా యాదవ్ 769 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్లో కొనసాగుతోంది. టాప్ స్థానంలో ఆ్రస్టేలియా స్టార్ బౌలర్ మెగాన్ స్కట్ (773 రేటింగ్ పాయింట్లు) ఉంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ (726), పూనమ్ యాదవ్ (716) ఒక్కో ర్యాంక్ చేజార్చుకుని.. వరుసగా ఐదు, ఆరు ర్యాంక్ల్లో నిలిచారు.
బ్యాటింగ్ విభాగంలో భారత ప్లేయర్లు తమ తమ ర్యాంక్లను కాపాడుకున్నారు. జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్ టాప్-10లో నిలిచారు. జెమీమా 699 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. మంధాన 669 పాయింట్లతో ఐదో స్థానంలో కోనసాగుతోంది.
కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 636 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ 768 పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉంది.
179 పరుగులతో సత్తాచాటి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' గా ఎంపికైన వికెట్ కీపర్-బ్యాట్స్మన్ జోన్స్ ర్యాంకింగ్స్లో దూసుకెళ్లింది. ఏకంగా 30 స్థానాలు ఎగబాకి కెరీర్-బెస్ట్ 17వ స్థానానికి చేరుకుంది. మహిళల టీ20 జట్ల విభాగంలో భారత్ 260 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ్రస్టేలియా 293 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్ (280), న్యూజిలాండ్ (276) ఉన్నాయి.
భారత మహిళల 'ఎ' జట్టుతో జరుగుతున్న అనధికారిక మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా మహిళల 'ఎ' జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. శనివారం జరిగిన రెండో టీ20లో ఆ్రస్టేలియా 37 పరుగుల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి ఓడిపోయింది. తొలి టీ20లో భారత్ 9 వికెట్ల తేడాతో ఓడిపోగా... నామమాత్రపు మూడో టీ20 ఈనెల 23న జరుగుతుంది.