
ఆరంభంలోనే షాక్:
134 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో కివీస్ ఓపెనర్లను కోలుకోనివ్వలేదు. 13 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. రేచల్ ప్రైస్ట్ (12)ను శిఖ పాండే పెవియన్ చేర్చింది. అనంతరం కెప్టెన్ సోఫి డివైన్ (14), సుజీ బేట్స్ (6) వికెట్లను చేజార్చుకుంది. దీంతో మూడు కీలక వికెట్లు కోల్పోయిన కివీస్ కష్టాలో పడింది.

ఆదుకున్న మ్యాడీ, మార్టిన్:
మ్యాడీ గ్రీన్ (24), క్యాటీ మార్టిన్ (25) నాలుగో వికెట్కు 43 పరుగులు జోడించారు. దీంతో కివీస్ రేసులోకి వచ్చింది. ఈ సమయంలో రెండు జట్ల విజయావకాశాలు సమానంగా మారాయి. ఇదే సమయంలో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మళ్లీ సమీకరణాలు మారిపోయాయి. శిఖా పాండే, రాజేశ్వరీ గైక్వాడ్ కివీస్ బ్యాటర్లను కట్టడి చేసారు. మ్యాడీ, క్యాటీ పెవిలిన్ చేరడంతో కివీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

అమెలియా కెర్ర్ పోరాటం:
90 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయిన జట్టుకు అమెలియా కెర్ర్ అండగా నిలిచింది. జట్టుకు విజయాన్ని అందించేందుకు ప్రయత్నించింది. 19 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు చేసింది. చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సిన దశలో పూనమ్ యాదవ్ వేసిన 19వ ఓవర్లో నాలుగు ఫోర్లు, రెండు పరుగులతో 18 పరుగులు చేసి జట్టును దాదాపు విజయానికి చేరువ చేసింది. కానీ.. చివరి ఓవర్లో మాత్రం జట్టుకు విజయాన్ని అందించలేక పోయింది. చివరి బంతికి ఔట్ అయి నిరాశపరిచింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ యాదవ్, రాధా యాదవ్ తలా ఓ వికెట్ పడగొట్టారు.

సెమీస్కు భారత్:
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. స్మృతి మందాన (11), హార్మన్ప్రీత్ కౌర్(1) విఫలమైనా.. యువ సంచలనం షెఫాలీ వర్మ 46 పరుగులతో రాణించింది. తానియా భాటియా (23) విలువైన పరుగులు చేసింది. అద్భుతమైన బ్యాటింగ్తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ షెఫాలీవర్మ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికైంది. ఈ విజయంతో భారత్ సెమీస్కు చేరుకుంది.


Click it and Unblock the Notifications












