
హైదరాబాద్: భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జులన్ గోస్వామి తమ అగ్రస్థానాలను నిలుపుకున్నారు. ఐసీసీ శుక్రవారం విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్లో స్మృతి మంధాన 797 పాయింట్లతో బ్యాట్స్ ఉమెన్ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా... బౌలర్ల కేటగిరీలో జులన్ గోస్వామి 730 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
భారత వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ 713 పాయింట్లతో నాలుగోస్థానంలో నిలిచింది. టాప్-10 బ్యాట్స్ ఉమెన్లో భారత్ నుంచి మిథాలీ, స్మృతి మినహా మరెవరికీ చోటు దక్కలేదు. ఐసీసీ శుక్రవారం ఆటగాళ్లతో పాటు, జట్ల ర్యాంకులను కూడా ప్రకటించింది. గత నెలలో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో ఉత్తమ ప్రదర్శన చేసిన స్మృతి తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది.
ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లీస్ పెర్రీ, న్యూజిలాండ్ కెప్టెన్ అమీ సాటర్త్వైట్, టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్, వెస్టీండీస్ కెప్టెన్ స్టాఫనీ టేలర్ ఉన్నారు. బౌలర్ల విభాగంలో టీమిండియా బౌలర్ జులన్ గోస్వామి అగ్రస్థానంలో నిలవగా... పేసర్ శిఖా (688 పాయింట్లు), లెగ్స్పిన్నర్ పూనమ్ యాదవ్ (656 పాయింట్లు) వరుసగా ఐదు, పదో స్థానాలను దక్కించుకున్నారు.
ఐసీసీ జట్ల ర్యాంకింగ్లో 22 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలవగా, 18 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది. భారత్ (16 పాయింట్లు), న్యూజిలాండ్ (14), దక్షిణాప్రికా (13) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. దీంతో న్యూజిలాండ్ వేదికగా 2021లో జరుగనున్న ఐసీసీ మహిళల ప్రపంచ కప్నకు టాప్-5లో నిలిచిన ఈ ఐదు దేశాలు అర్హత సాధించాయి.