హైదరాబాద్: లాహోర్ వేదికగా సెప్టెంబర్లో స్వదేశంలో వరల్డ్ ఎలెవన్ టీమ్తో తలపడే 16 మంది సభ్యుల జట్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టుకు పాకిస్థాన్ రెగ్యులర్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్గా బాధ్యతలను నిర్వర్తించనున్నాడు.
సుదీర్ఘ విరామం తర్వాత పాక్ పేసర్ సొహైల్ ఖాన్ ఈ మ్యాచ్ ద్వారా పునరాగమనం చేయనున్నాడు. సొహైల్ ఖాన్ చివరిసారిగా 2016 అక్టోబర్లో జరిగిన మ్యాచ్లో ఆడాడు. మరోవైపు యువ ఆటగాళ్లు ఫహీమ్ అష్రాఫ్, రుమన్ రేయిస్, ఉస్మాన్ షిన్వారి, అమీర్ యమీన్లకు చోటు కల్పించారు.

ఇక, జట్టులోని సీనియర్ ఆటగాళ్లు అజహర్ అలీ, మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్, వాహబ్ రియాజ్లకు చోటు దక్కలేదు. 'ఇటీవలి కాలంలో ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా జట్టును ఎంపిక చేశాం. యువకులు, సీనియర్ ఆటగాళ్ల కలయికతో జట్టు కూర్పు ఉంది' అని చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ హుల్హక్ పేర్కొన్నారు.
పాకిస్థాన్తో మూడు టీ20 మ్యాచ్లు ఆడనున్న ప్రపంచ ఎలెవన్ జట్టుకు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్ డుప్లిసిస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. దుబాయిలో రెండు రోజుల క్యాంప్ అనంతరం వరల్డ్ ఎలెవన్ జట్టు సెప్టెంబర్ 12, 13, 15 తేదీల్లో పాకిస్థాన్తో మూడు టీ20లు ఆడనుంది.
ఈ జట్టులో దక్షిణాఫ్రికా నుంచి డుప్లెసిస్తో పాటు ఆమ్లా, మోర్కెల్, మిల్లర్, తాహిర్, ఆస్ట్రేలియా నుంచి బెయిలీ, బెన్ కట్టింగ్, టిమ్ పేన్, విండీస్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు ఆడనున్నారు. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, శ్రీలంక నుంచి ఒక్కో ఆటగాడు పాల్గొననున్నారు.