క్రికెట్ ప్రియులను అలరించేందుకు మహిళల క్రికెట్ లో మరో మెగా ఈవెంట్ సిద్ధమైంది. మలేసియా వేదికగా అండర్-19 టీ20 వరల్డ్ కప్ మొలైంది. మహిళల క్రికెట్కు మరింత తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ఐసీసీ దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రెండేళ్ల క్రితం జరిగిన ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన యువ భారత్... ఈ సారి కూడా ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో బరిలోకి దిగింది.
మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్లుగా విడిపోయి బరిలోకి దిగాయి. గ్రూప్ - ఏలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తో పాటు మలేసియా, శ్రీలంక, వెస్టిండీస్ ఉన్నాయి. నికీ ప్రసాద్ సారథ్యంలోని టీమిండియా బరిలోకి దిగుతోంది. ఆదివారం తన తొలి మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి గొంగడి త్రిష, షబ్నమ్ షకీల్, ద్రితి కేసరి ఈ ప్రపంచ కప్ బరిలోకి దిగారు. టోర్నీ ప్రారంభ మ్యాచ్లో ఆస్ట్రేలియా - స్కాట్లాండ్ తలపడనున్నాయి.

జాతీయ జట్టులో చోటు లక్ష్యంగా తెలుగమ్మాయి
గత ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా తరఫున అత్యధిక స్కోరర్గా నిలిచింది హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష. ఇప్పుడు వరుసగా రెండో సారి ఈ మెగా టోర్నీ బరిలోకి దిగింది. గత నెలలో జరిగిన మహిళల అండర్-19 ఆసియా కప్లో భారత జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించింది త్రిష. ఈ సారి కూడా మెరుగైన ప్రదర్శన చేసి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలనే లక్ష్యంతో ఆడుతోంది.
ఏ సమయంలో చూడాలంటే?
ప్రస్తుతం జరుగుతోన్న అండర్ 19 మహిళల ప్రపంచకప్ 2025 ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచులు ప్రారంభం అవుతాయి.
ఎక్కడ చూడాలంటే?
స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఈ ప్రపంచ కప్ బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ ను తీసుకుంది. స్టార్ స్పోర్ట్స్ 2(HD+SD), స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ(HD+SD)లో మ్యాచులు ప్రసారం అవుతాయి. అయితే స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ మాత్రం భారత్ సెమీఫైనల్, ఫైనల్ క్వాలిఫై అయితేనే ప్రసారం చేస్తుంది.