
ఆ వారం రోజులు భయపడ్డా
పృథ్వీషా నేతృత్వంలోని యువ జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముంబైకి చేరుకున్న అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు కెప్టెన్ పృథ్వీ షా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ అండర్-19 వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలోనే ఐపీఎల్ వేలం జరగడం భారత కుర్రాళ్లకు ఇబ్బందిగా మారిందని అన్నాడు. 'ఐపీఎల్ వేలానికి ముందు, వెనుక ఒక వారం రోజుల పాటు పరిస్థితులు ఇబ్బందికరంగా సాగాయి. అయితే కుర్రాళ్లు చూపిన పరిణతికి అభినందించాలి. వేలం అవ్వగానే ఆ సంగతి వదిలేసి ప్రాక్టీస్లో మునిగిపోయారు. ఆ మూడు రోజులు మాత్రం కొంచెం భయపడ్డా' అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
ఫైనల్లో భారత్ నెంబర్ వన్ గేమ్ ఆడలేదు
ఐపీఎల్ 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో అండర్-19 జట్టులోని ఏడుగురు ప్లేయర్లను ప్రాంఛైజీలు కొనుగోలు చేయగా... అందులో బౌలర్లు కమలేష్ నాగర్కోటి రూ.3.2 కోట్లు, శివమ్ మావి రూ.3 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు ప్రదర్శనపై కూడా రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. 'ఫైనల్లో భారత్ నెంబర్ వన్ గేమ్ ఆడలేదు. కానీ క్వార్టర్స్, సెమీస్లో మాత్రం చాలా బాగా ఆడారు. ఫైనల్ మంచి అనుభవం. పాక్తో ఆడటం కుర్రాళ్లకు మంచి అవకాశం. ఈ 15 మంది కుర్రాళ్లు వరల్డ్ కప్ మెడల్స్ ధరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. చివరగా టోర్నీలో నాణ్యమైన క్రికెట్ ఆడటం చాలా సంతృప్తినిచ్చింది' అని ద్రవిడ్ తెలిపాడు.
ఒత్తిడిలో చక్కటి ప్రదర్శన చేశారు
'కొన్ని మ్యాచ్ల్లో ఒత్తిడి ఎదుర్కొన్నపుడు కొందరు ఆటగాళ్లు నిలబడి చక్కటి ప్రదర్శన చేశారు. వరల్డ్ కప్ గెలవడం కంటే ఈ 14-16 నెలల ప్రయాణం ఎక్కువ సంతృప్తినిస్తుంది. వరల్డ్కప్ను పక్కన పెడితే అండర్-19 కుర్రాళ్లను తీర్చిదిద్దడం సంతోషాన్నిచ్చింది. ఈ విజయానికి సెలక్టర్లు, జాతీయ క్రికెట్ అకాడమీ, బీసీసీఐ కూడా కారణం. జట్టు సమష్టి కృషికి ప్రతిఫలమే ఈ విజయం' అన్నాడు.

అండర్-19 ప్లేయర్ల భవిష్యత్తుపై ద్రవిడ్ ఇలా
చివర్లో అండర్-19 ప్లేయర్ల భవిష్యత్తుపై కూడా ద్రవిడ్ స్పందించాడు. 'వారికి అసలైన సవాల్ ఇకపైనే మొదలవుతుంది. దాని గురించి ఇప్పటికే మాట్లాడాం కూడా. 2012 ప్రపంచకప్ ఫైనల్లో భారత్.. ఆస్ట్రేలియాను ఓడించింది. అయితే అప్పటి భారత జట్టు నుంచి ఒక్కరే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కానీ నాటి ఆస్ట్రేలియా జట్టు నుంచి ఐదారుగురు అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. ప్రస్తుత జట్టులో ప్రతిభ, సామర్థ్యం ఉన్నాయి. ఒత్తిడిని ఎదుర్కోవడం, అంచనాల్ని తట్టుకోవడం కీలకం. భారత జట్టులోకి రావడం సులువు కాదు. ముందు మెరుగైన ఫస్ట్క్లాస్ క్రికెటర్లుగా ఎదగాలి. అక్కడి నుంచి భారత జట్టులోకి రావచ్చు' అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











