
పాచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య మరి కొన్ని నిమిషాల్లో మెగా సమరం ప్రారంభం కానుంది. అండర్-19 ప్రపంచకప్లో భాగంగా తొలి సెమీఫైనల్లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన పాక్ కెప్టెన్ రోహైల్ నజీర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం పాక్ ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు భారత కెప్టెన్ ప్రియం గార్గ్ విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించాడు.
గత రెండు పర్యాయాలు ప్రపంచకప్ ఫైనల్కు చేరిన యువ భారత జట్టు.. పాకిస్థాన్ను చిత్తు చేసి వరుసగా మూడోసారి తుదిపోరుకు అర్హత సాధించాలని చూస్తోంది. 2010 మెగాటోర్నీ తర్వాత భారత్పై ఒక్కసారి కూడా గెలువని పాకిస్థాన్.. ఈ సారి ముందంజ వేయాలని పట్టుదలగా ఉంది. భారత్ గతంలో నాలుగు సార్లు ప్రపంచకప్ను సొంతం చేసుకుంటే.. పాక్ రెండు సార్లు విజేతగా నిలిచింది.
గ్రూప్ దశలో మూడు మ్యాచ్లు నెగ్గిన భారత్.. క్వార్టర్స్లో పటిష్ట ఆస్ట్రేలియాను చిత్తుచేసి సెమీఫైనల్కు దూసుకొచ్చింది. ఇక లీగ్ దశలో రెండు మ్యాచ్లు నెగ్గి మరో మ్యాచ్ రద్దు కావడంతో క్వార్టర్స్ చేరిన పాక్.. ఆక్కడ ఆఫ్ఘానిస్థాన్ను మట్టికరిపించింది. తాజా టోర్నీలో ప్రదర్శనను బట్టి చూస్తే మాత్రం ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజేతను అంచనా వేయడం అంత సులువు కాదు. మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
పోచెఫ్స్ట్రూమ్లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. మంగళవారం వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సెమి ఫైనల్ మ్యాచ్ రైద్దెతే.. గ్రూప్ స్టేజ్లో ఎక్కువ విజయాలు సాధించిన భారత్ ఫైనల్కు చేరుతుంది. ఆరంభంలో పిచ్ బ్యాటింగ్కు అనుకూలించినా.. బంతి పాతబడ్డాక స్పిన్నర్లు ప్రభావం చూపగలరు.
తుది జట్లు:
భారత్: ప్రియం గార్గ్ (కెప్టెన్), యశస్వి, దివ్యాన్ష్, తిలక్ వర్మ, ధృవ్ జురేల్, సిద్ధేశ్, అథర్వ, రవి, సుశాంత్, కార్తీక్, ఆకాశ్.
పాకిస్థాన్: రోహైల్ నజీర్ (కెప్టెన్), హైదర్ అలీ, హురేరా, ఫహద్, ఖాసిం, హరీస్, ఇర్ఫాన్ ఖాన్, అబ్బాస్ అఫ్రీది, తాహిర్, అమీర్ అలీ, అమీర్ ఖాన్.