
హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే చాలు.... అది ఏ గేమ్లోనైనా అభిమానులకు కనువిందే. అయితే, న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో మంగళవారం భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి.
రెండో సెమీ ఫైనల్లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది. అయితే, ఈ మ్యాచ్లో క్రీడాస్ఫూర్తి వెల్లివిరిసింది. టోర్నీలో భాగంగా క్రైస్ట్ చర్చ్లోని హాగ్లీ ఓవల్ మైదానంలో ఇరు దేశాల యువ ఆటగాళ్లు పరస్పరం సహకరించుకున్న తీరు క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ మ్యాచ్లో భారత బ్యాట్స్మన్ శుభ్మాన్ గిల్ సెంచరీకి చేరువైన సమయంలో అతడి షూ లేసు ఊడిపోవడంతో మైదానంలో పాకిస్తాన్ ఫీల్డర్ అతడికి సాయం చేశాడు. అలాగే తమ ప్రత్యర్థి బ్యాట్స్మన్ షూ లేసు ఊడిపోయినప్పుడు భారత ఫీల్డర్ కూడా సాయం చేశాడు.
ఇక, ఈ మ్యాచ్లో శుభ్మాన్ గిల్ సెంచరీ చేసిన సమయంలో అతడి దగ్గరకు వచ్చి పాకిస్తాన్ ఆటగాళ్లు అభినందించారు. టోర్నీలో హై ఓల్టేజ్ మ్యాచ్ కావడంతో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ, వారు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి మాత్రం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది.
దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో భారత్-పాక్ క్రికెటర్లు ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదంటూ కొందరు నెటిజన్లు ట్వీట్టర్లో కామెంట్లు పెట్టారు. ఈ మ్యాచ్లో భారత్ 203 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. శుభ్మాన్ గిల్ సెంచరీ(102)తో రాణించాడు. కెప్టెన్ పృథ్వీ షా(41), మన్జ్యోత్ కల్రా(47), సుధాకర్ రాయ్(33) పరుగులతో ఫరవాలేదనిపించారు.
పాకిస్థాన్ బౌలర్లలో మొహమ్మద్ మూసా 4, అర్షల్ ఇక్బాల్ 3 వికెట్లు తీశారు. అనంతరం 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 69 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో ఇషాన్ పోరెల్ నాలుగు వికెట్లు తీయగా... శివసింగ్, రియాన్ పరాగ్ తలో రెండేసి వికెట్లు తీశారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.