
హైదరాబాద్: న్యూజిలాండ్లో జరుగుతోన్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్లో భారత యువ జట్టు తన జోరుని కొనసాగిస్తోంది. శుక్రవారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో పృథ్వీ షా నేతృత్వంలోని భారత యువ జట్టు క్వార్టర్స్లోకి అడుగుపెట్టింది.
అయితే, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. భారత ఓపెనర్లు శుభ్మాన్ గిల్ 59 బంతుల్లో 90 పరుగులు, దేశాయ్ 73 బంతుల్లో 56 పరుగులు సాధించడంతో లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. శుభ్మాన్ గిల్ ఇన్నింగ్స్లో 13 ఫోర్లు, ఒక సిక్సు ఉంది.
ఈ మ్యాచ్లో శుభ్మాన్ గిల్ ఆటతీరు క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా జింబాబ్వే బౌలర్ కొసిలాతి నుంగు విసిరిన 14వ ఓవర్లో గిల్ ఆడిన షాట్ క్రికెట్ అభిమానులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. అచ్చం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ షాట్ మాదిరి ఆడాడు.
అంతేకాదు ఆ బంతిని భారీ సిక్సర్గా కూడా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే 48.1 ఓవర్లలో 154 పరుగులు చేసి ఆలౌటైంది. జింబాబ్వే ఆటగాళ్లు మధేవీరే(30), శుంభు(36), రోచి(31) తప్ప మిగతా ఆటగాళ్లు ఎవరూ రాణించలేకపోయారు.
భారత ఆల్రౌండర్ అనుకుల్ రాయ్ ఈ మ్యాచ్లో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. 7.1 ఓవర్లు వేసిన అనుకుల్ రాయ్ 4 వికెట్లు తీశాడు. అనంతరం 155 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 21.4 ఓవర్లలో జింబాబ్వే నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించింది.
భారత బ్యాట్స్ మెన్లలో శుభమ్ గిల్ (90 నాటౌట్), హర్విక్ దేశాయ్ (56 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. తాజా విజయంతో భారత యువ జట్టు గ్రూప్ బీలో అగ్రస్ధానంలో నిలిచింది. ఇక, క్వార్టర్ ఫైనల్స్లో భారత్ జట్టు బంగ్లాదేశ్తో తలపడనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.