ముంబై: క్రికెట్ ఆడే దేశాలన్నీ కూడా ప్రస్తుతం ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నమెంట్లో తీరిక లేకుండా గడుపుతున్నాయి. ఈ టోర్నమెంట్ ముగింపుదశకు వచ్చింది. గ్రూప్ దశ మ్యాచ్లన్నీ90 శాతం అయిపోయాయి. అన్ని జట్లు కూడా ఒకటి చొప్పున మ్యాచ్లను ఆడాల్సి ఉంది. ఈ నెల 12వ తేదీ నాటికి భారత్- నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్తో గ్రూప్ దశ ముగుస్తుంది.
15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయ్యాయి. 19వ తేదీన ఫైనల్స్ ఉంటుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక. ఫైనల్స్ ఆడే జట్లు ఏవిటనేది తెలియడానికి 16వ తేదీ రాత్రి వరకూ వేచి ఉండక తప్పదు ఫ్యాన్స్కు. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ చేరాయి. ఇంకో బెర్త్ మిగిలివుంది.

ఈ పరిస్థితుల్లో మరో ఐసీసీ ఈవెంట్ ప్రేక్షకులను పలకరించింది. అండర్ 19 ఆసియా కప్ టోర్నమెంట్ జరగబోతోంది. ఐసీసీ- ఆసియా క్రికెట్ కౌన్సిల్ సంయుక్తంగా దీన్ని నిర్వహించనున్నాయి. ఈ టోర్నమెంట్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మరోసారి తలపడనున్నాయి. విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తి రేపుతోంది.
మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనబోయే టోర్నమెంట్ ఇది. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, గ్రూప్- బీలో బంగ్లాదేశ్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్ ఉన్నాయి. డిసెంబర్ 8వ తేదీన భారత్- ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్- నేపాల్ జట్ల మధ్య జరిగే మ్యాచ్తో ఈ టోర్నమెంట్ ఆరంభమౌతుంది. తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది.
9వ తేదీన బంగ్లాదేశ్- యూఏఈ, శ్రీలంక- జపాన్,10వ తేదీన భారత్- పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్- నేపాల్ తలపడతాయి. 11వ తేదీన శ్రీలంక- యూఏఈ, బంగ్లాదేశ్- జపాన్, 12వ తేదీన పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్, భారత్- నేపాల్, 13వ తేదీన బంగ్లాదేశ్- శ్రీలంక, యూఏఈ- జపాన్ మధ్య మ్యాచ్ ఉంటుంది.
15వ తేదీ నాడే రెండు సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయ్యాయి. 17వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ టోర్నమెంట్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యాన్ని ఇస్తోంది. మ్యాచ్లన్నీ కూడా ఉదయం 9:30 గంటలకు ఆరంభమౌతాయి. వాటన్నింటినీ ఐసీసీ అకాడమీ ఓవల్ 1, 2 స్టేడియాలు వేదిక. తొలి సెమీ ఫైనల్, ఫైనల్ మాత్రం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో షెడ్యూల్ అయింది.