
దుబాయ్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కు ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతో క్రికెట్ సంబంధాలను తెంచుకునేలా చర్యలు తీసుకోవాలని అంటూ బీసీసీఐ చేసిన వినతిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ద్వందంగా తోసి పుచ్చింది. అది తమ పని కాదని స్పష్టం చేసింది. ఆయా దేశాల ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం మీద ఇలాంటి చర్యలు ఆధారపడి ఉంటాయని పేర్కొంది. దీనితో- వచ్చే ప్రపంచకప్ లో భారత క్రికెట్ జట్టు.. పాకిస్తాన్ తో తలపడటం దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది.
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద కిందటి నెల 14వ తేదీన సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషె మహమ్మద్ ఉగ్రవాదులు నిర్వహించిన దాడిలో 40 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు తామే కారణమని జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడం, ఆ సంస్థ మూలాలు పాకిస్తాన్ లో ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలతో క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని కోరుతూ బీసీసీఐ.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు లేఖ రాసింది. ఈ లేఖలో ఎక్కడా పాకిస్తాన్ పేరు ప్రతిపాదించలేదు. ఈ లేఖపై ఐసీసీ పూర్తి స్థాయిలో చర్చ చేపట్టింది. ఐసీసీ ఛైర్మన్, భారత్ కు చెందిన శశాంక్ మనోహర్ నేతృత్వంలో ఆరు రోజులుగా దుబాయ్ లోకొనసాగుతున్న కార్యనిర్వాహక సమావేశంలో దీన్ని చర్చకు తీసుకు వచ్చింది. తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌధరి బీసీసీఐ తరఫున ఈ సమావేశానికి హాజరయ్యారు. బీసీసీఐ లేఖపై చర్చించిన అనంతరం- తన నిర్ణయాన్ని విస్పష్టంగా ప్రకటించింది ఐసీసీ.
ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలతో క్రికెట్ సంబంధాలను తెంచుకునే నిర్ణయాన్ని తీసుకోలేమని వెల్లడించింది. దీనికి సంబంధించిన నియమ, నిబంధనలు కూడా ఎక్కడా లేవని పేర్కొంది. ఇది తమ పరిధిలోని విషయం కాదని అభిప్రాయపడింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతో క్రికెట్ ఆడాలా? వద్దా? అనే నిర్ణయం.. ఆయా దేశాల ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుందని తేల్చి చెప్పింది. క్రికెట్ ఆడకూడదంటూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కుండబద్దలు కొట్టింది. ఇది సున్నితమైన విషయమని, దీనిపై తమంతట తాముగా నిర్ణయం తీసుకోవడం సబబు కాదని ఐసీసీ స్పష్టం చేసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచుల్లో వివిధ దేశాలకు చెందిన జాతీయ స్థాయి క్రికెటర్లు ఆడుతున్నారని, ఇలాంటి సందర్భాల్లో తాము తీసుకునే నిర్ణయం వారిపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం.. ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు జూన్ 16వ తేదీన పాకిస్తాన్ తో తలపడాల్సి ఉంది. పుల్వామా ఉగ్రదాడి తరువాత.. ఈ మ్యాచ్ ను బాయ్ కాట్ చేయాలని దేశవ్యాప్తంగా పలువురు అభిమానులు గళమెత్తారు. బీసీసీఐకి, భారత క్రికెట్ జట్టుకు వినతులు పంపించారు. భారత జట్టు మాజీ కేప్టెన్ సౌరభ్ గంగూలి, క్రికెటర్ హర్భజన్ సహా పలువురు క్రీడాకారులు ఇదే డిమాండ్ లేవనెత్తారు.