
న్యూఢిల్లీ: బౌలర్ల ఫ్రంట్ఫుట్ నోబాల్స్ను ప్రకటించే అధికారాన్ని ఇక అన్ఫీల్డ్ అంపైర్లు కోల్పోనున్నారు. ఐసీసీ త్వరలో ప్రయోగాత్మకంగా ఫ్రంట్ఫుట్ నోబాల్స్ను ప్రకటించే అధికారాన్ని థర్డ్ అంపైర్లకు ఇవ్వనుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆరు నెలల పాటు పలు సిరీస్లలో ఈ నూతన పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించినట్టు ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డీస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాడు.
ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో నోబాల్ (బౌలర్ క్రీజు బయట అడుగేసినప్పుడు)పై నిర్ణయం తీసుకునే హక్కును అన్ఫీల్డ్ అంపైర్లు కోల్పోనున్నారు. 2016లో ఇంగ్లండ్-పాక్ మధ్య జరిగిన సిరీస్లో దీన్ని అమలు చేసినా.. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా నిలిపివేసారు. అయితే మరోసారి ఈ పద్దతిని ప్రయోగించాలని ఐసీసీ నిర్ణయించింది. దీంతో అన్ఫీల్డ్ అంపైర్ల పని మరింత సులువవనుంది.
ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డీస్ మాట్లాడుతూ... 'బౌలర్ బంతి వేసిన కొన్ని సెకన్లలోనే ఫ్రంట్ఫుట్ ఇమేజ్ థర్డ్ అంపైర్కు కనబడుతుంది. ఒకవేళ నోబాల్ పడితే.. అతడు వెంటనే ఆన్ఫీల్డ్ అంపైర్కు చెబుతాడు. ఇక సరైన బంతే అయితే ఎలాంటి సంప్రదింపులు ఉండవు. థర్డ్ అంపైర్ నోబాల్ అని చెబితే తప్ప మైదానంలో బౌలర్ వేసే ప్రతి బంతీ సరైందే. క్రికెట్ కమిటీ సలహా మేరకు మరోసారి ఈపద్ధతిని ప్రయోగిస్తున్నాం' అని అలార్డీస్ తెలిపాడు.