దుబాయ్/న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో విజయవం సాధించిన అనంతరం టీమిండియా టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అంతేగాక, అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్ను కిందికి నెట్టి నెంబర్ వన్ ర్యాంక్ సాధించిందని సంబరాలు కూడా చేసుకున్నారు అభిమానులు.
అయితే, భారత క్రీడాభిమానులకు షాకింగ్ కలిగించే వార్త ఇప్పుడు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే.. భారత్ నంబర్ వన్ ర్యాంకు అవాస్తవమని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చెబుతోంది. ఇప్పటికీ పాకిస్థాన్ తొలి స్థానంలో కొనసాగుతున్నట్టు తన అధికారిక వెబ్సైట్లో తెలిపింది.
మొత్తం 25 మ్యాచ్ లు ఆడిన పాకిస్థాన్ 2767 పాయింట్లతో, 111 రేటింగ్ తో అగ్రస్థానంలో ఉండగా, 25 మ్యాచ్లు ఆడిన ఇండియా 2748 పాయింట్లు, 110 రేటింగ్తో రెండో స్థానంలో ఉంది. ఆపై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాబ్వేలు టాప్-10 స్థానాల్లో ఉన్నాయి.
అయితే, న్యూజిలాండ్, ఇండియా టెస్ట్ సిరీస్ పూర్తైన తర్వాత టెస్ట్ ర్యాంకింగ్స్ మార్పు చేసే అవకాశముందని తెలుస్తోంది.

గంగూలీ ఆశ్చర్యం
పాకిస్థాన్ జట్టు టెస్టుల్లో వరల్డ్ నెంబర్ వన్ స్థానం సాధించడం పట్ల టీమిండియా మాజీ కెప్టెన్, పశ్చిమబెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ జట్టు కంటే టీమిండియా చాలా ఉత్తమమైనదని పేర్కొన్నారు. ఈ రెండు జట్ల మధ్య పోలికకు అవకాశమే లేదని పేర్కొన్నారు. టెస్ట్ క్రికెట్ లో కోహ్లీ సేన పాక్ కంటే చాలా ముందుందని అభిప్రాయపడ్డ దాదా, అసలు పాకిస్థాన్ నెంబర్ వన్ ర్యాంక్కు చేరుకోవడమే ఆశ్చర్యానికి గురి చేసే అంశమని పేర్కొన్నారు.
టీమిండియా టాప్ ర్యాంక్ కు చేరుకోవడం గురించి తాను ఆలోచించలేదని ఆయన చెప్పారు. రెండో టెస్ట్లో భారత్ గెలవడం తనలాంటి వారికి చాలా ఆనందం కలిగించిందని తెలిపారు.