టీమిండియా ర్యాంకు పతనం
ఇన్ని రోజులు టెస్టు ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న టీమిండియాకు షాక్ తగిలింది. ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ ఓడడంతో ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 116 పాయింట్లు ఉన్నాయి. ఇక భారత్పై 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు టెస్టు ర్యాంకింగ్స్లో ఐదో స్థానానికి ఎగబాకింది. సఫారీల ఖాతాలో 101 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
నంబర్ వన్ ప్లేసుకు ఆస్ట్రేలియా
ఇటీవల సొంత గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్ను 4-0తో గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో మూడో స్థానం నుంచి అగ్ర స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖాతాలో 119 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన 5 టెస్టు మ్యాచ్ల యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా బ్రిస్బేన్, అడిలైడ్, మెల్బోర్న్, హోబర్ట్లలో జరిగిన ఒకటి, రెండు, మూడు, ఐదు టెస్ట్ మ్యాచ్లలో విజయం సాధించింది. సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక యాషెస్ సిరీస్లో ఓడిన ఇంగ్లండ్ జట్టు టెస్టు ర్యాంకింగ్స్లో నాలుగో స్థానంలో ఉంది.
రెండో స్థానంలో న్యూజిలాండ్
ఇక ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్ను డ్రాగా ముగించిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ న్యూజిలాండ్ ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ ఖాతాలో 117 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక 93 రేటింగ్ పాయింట్లతో పాకిస్థాన్ ఆరో స్థానానికి పడిపోయింది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ ఉన్నాయి.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్
ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విషయానికొస్తే 2021-23 సీజన్లో ఇప్పటి వరకు 10 టెస్టు మ్యాచ్లు ఆడిన భారత్ 49 శాతంతో విజయాలు సాధించింది. 4 మ్యాచ్ల్లో గెలిచి, 3 ఓటములు, 3 డ్రాలతో ఐదో స్థానంలో ఉంది. ఇక ఆడిన 5 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించిన ఆస్ట్రేలియా 86 శాతం విజయాలతో మొదటి ప్లేసులో ఉంది. కాగా త్వరలోనే టీమిండియా.. శ్రీలంకతో స్వదేశంలో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది.