కెరీర్ బెస్ట్ ర్యాంకుకు రోహిత్:
ఓపెనర్గా బరిలోకి దిగిన తొలి టెస్టులోనే రెండు శతకాలతో (176, 126) విజృంభించిన రోహిత్ శర్మ ర్యాంకింగ్స్లో ఒకేసారి 36 స్థానాలు ఎగబాకి కెరీర్ అత్యుత్తమ 17వ ర్యాంకుకు చేరుకున్నాడు. గతంలో ఆడిన 27 టెస్టుల్లో మిడిల్ ఆర్డర్లో బరిలోకి దిగిన రోహిత్.. విశాఖ టెస్ట్ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి భారత్ భారీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 38 స్థానాలు మెరుగుపరుచుకొని 25వ ర్యాంకుకు చేరాడు.
టాప్ ర్యాంకులో స్మిత్:
కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానాన్ని నిలబెట్టుకొన్నా.. అతడి పాయింట్లు 899కి పడిపోయాయి. జనవరి 2018 తర్వాత కోహ్లీ పాయింట్ల సంఖ్య 900 కంటే తక్కువకు పడిపోవడం ఇదే మొదటిసారి. టాప్ ర్యాంకులో ఉన్న స్టీవ్ స్మిత్ (937, ఆస్ట్రేలియా) కంటే 38 పాయింట్లు తక్కువ ఉన్నాయి.
టాప్-10లో అశ్విన్:
టెస్టు బౌలర్ల జాబితాలో అశ్విన్ మళ్లీ టాప్-10లోకి చేరాడు. తొలి టెస్టులో 8 వికెట్లు తీయడంతో 4 స్థానాల్ని మెరుగుపర్చుకొని పదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో అశ్విన్ టాప్-5లో అడుగుపెట్టాడు. కెరీర్ బెస్ట్గా 710 పాయింట్లు దక్కించుకున్న పేసర్ మొహమ్మద్ షమీ రెండు స్థానాలు ఎగబాకి 16వ ర్యాంకుకు చేరాడు. ఆల్రౌండర్లలో జడేజా రెండో ర్యాంక్ చేజిక్కించుకున్నాడు.
రెండో స్థానంలో భారత్:
మహిళల వన్డే ర్యాంకింగ్స్లో భారత్ రెండో స్థానాన్ని నిలబెట్టుకొంది. మూడో ర్యాంకర్ ఇంగ్లండ్ (122) కంటే భారత్ (125 పాయింట్లు) 3 పాయింట్లు ముందుంది. ఆస్ట్రేలియా (151) టాప్ ర్యాంకులో కొనసాగుతోంది. టీ20ల్లో కూడా ఆసీస్ టాప్ ర్యాంకులో ఉండగా.. భారత్ ఐదో స్థానంలో ఉంది.