
దుబాయ్: టీమిండియా యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్, గోల్డెన్ బాయ్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. బుధవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన టెస్టు బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్లో పంత్ ఆరో ర్యాంకు సాధించాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ను పంత్ వెనక్కి నెట్టి ఆరో స్థానం దక్కించుకున్నాడు. ఇంతకుముందు 9వ స్థానంలో ఉన్న పంత్.. మూడు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. అతడికే ఇదే అత్యుత్తమ ర్యాంక్. 23 ఏళ్ల వయసులోనే పంత్ ఈ ఘనత సాధించడం విశేషం.
ఐసీసీ టెస్టు బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్ టాప్-10లో వికెట్ కీపర్ బ్యాట్స్మన్ చోటు దక్కించుకోవడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి. భారత వికెట్ కీపర్ ఈ ఫార్మాట్లో సాధించిన అత్యధిక ర్యాంకింగ్ కూడా ఇదే. అంతకుముందు ఆస్ట్రేలియా, ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన పంత్.. ర్యాంకింగ్ పాయింట్లను మెరుగుపరచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో గత కొద్ది రోజులుగా అన్ని ఫార్మాట్లలో పంత్ పరుగుల వరదపారిస్తున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్ట్ సిరీసులను భారత్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్లో ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. రిషబ్ పంత్తో పాటు హెన్రీ నికోల్స్-7, రోహిత్ శర్మ-8 కూడా 747 రేటింగ్ పాయింట్లతో టాప్-10లో ఉన్నారు. న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ 919 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 981 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే నాలుగు స్థానాలు ఎగబాకి 11 వ స్థానానికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో సెంచరీ (118), హాఫ్ సెంచరీ (66) చేసిన అతడు మొత్తం 712 పాయింట్లు సాధించాడు.
గతంలో పేలవ ఆటతీరుతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న రిషబ్ పంత్.. గత ఐదు ఆరు నెలల్లోనే భారత అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ (97: 118 బంతుల్లో 12x4, 3x6), గబ్బా (89; 138 బంతుల్లో 9x4, 1x6) టెస్టుల్లో రెచ్చిపోయిన పంత్.. టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించిన విషయం తెలిసిందే. ఇటీవల ఇంగ్లండ్తోనూ జరిగిన చివరి టెస్టులో శతకం (101; 118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు) బాది.. మరోసారి తాను ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. ఆపై టీ20, వన్డే సిరీస్లో అదరగొట్టాడు. ఇక ఐపీఎల్ 2021లోనూ తనదైన ఫామ్ కనబరిచాడు.