
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సత్తా చాటాడు. గత వారం ఆల్రౌండర్ల జాబితాలో అగ్ర స్థానాన్ని కోల్పోయిన జడేజా.. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో తిరిగి తన టాప్ ప్లేస్ను కైవసం చేసుకున్నాడు. మొత్తం 385 రేటింగ్ పాయింట్లతో జడేజా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక గత వారం రవీంద్ర జడేజాను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరుకున్న వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ 357 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. 341 రేటింగ్ పాయింట్లతో టీమిండియా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్తో టెస్ట్ సిరీస్లో రాణించిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఆల్రౌండర్ల జాబితాలో టాప్ 10లోకి ప్రవేశించాడు. 255 రేటింగ్ పాయింట్లతో కమిన్స్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విభాగంలో ఆరో స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారాడు. 754 రేటింగ్ పాయింట్లతో హిట్మ్యాన్ ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక 742 రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లీ, 738 రేటింగ్ పాయింట్లతో రిషబ్ పంత్ తొమ్మిది, పదో స్థానాల్లో స్థిరంగా కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో రాణించిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మూడు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఇదే సిరీస్లో రాణించిన ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాతోపాటు పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కూడా తమ స్థానాలను మెరుగుపరచుకున్నారు.
ఇక వన్డే ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ తన రెండో స్థానాన్ని నిలుపుకోగా, కెప్టెన్ రోహిత్ శర్మ నాల్గో స్థానానికి పడిపోయాడు. ఇక బౌలర్ల జాబితాలో వన్డే ర్యాంకింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా ఆరో స్థానంలో ఉండగా.. రవీంద్ర జడేజా పదో ర్యాంకులో ఉన్నాడు.