
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీసులో పరుగుల వరద పారిస్తున్న రూట్.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను వెనక్కి నెట్టి నంబర్ వన్గా నిలిచాడు. ప్రస్తుతం రూట్ ఖాతాలో 916 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీసులో రూట్ మూడు శతకాలు బాదాడు. ట్రెంట్ బ్రిడ్జ్, లార్డ్స్, లీడ్స్ టెస్టుల్లో రూట్ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో ఈ క్రికెట్ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ కూడా అతనే. రూట్ టెస్ట్ క్రికెట్ కేరీర్.. ప్రస్తుతం అత్యున్నత స్థితిలో కొనసాగుతోంది.
జో రూట్ ఈ ఏడాది ఆరంభం నుంచి మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన బ్యాట్స్మన్గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకుముందు నాలుగులో ఉన్న రూట్. పరుగుల వరద పారిస్తూ టాప్లోకి దూసుకొచ్చాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 901 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం న్యూజీలాండ్ టీమ్ ఎక్కువగా టెస్ట్ మ్యాచులు ఆడని విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ (891), మరో యువ ఆసీస్ ఆటగాడు మార్నస్ లబుషేన్ (878) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తొలిసారి టెస్టు ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో టాప్-5లోకి వచ్చాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీని అధిగమించి ఐదవ స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ ఖాతాలో 773 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లండ్ పర్యటనలో స్థిరమైన ప్రదర్శన చేయడంతో రోహిత్ టాప్-5లో చోటుదక్కించుకున్నాడు. లార్డ్స్లో జరిగిన రెండో టెస్టులో 89 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. లీడ్స్లో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ (59) సాధించాడు. 763 పాయింట్లతో కోహ్లీ ఆరో స్థానానికి పడిపోయాడు. 2017 తర్వాత కోహ్లీ టాప్-5లో చోటు కోల్పోవడం ఇదే తొలిసారి. వికెట్ కీపర్-బ్యాట్స్మన్ రిషబ్ పంత్ టాప్-10 చోటు కోల్పోయాడు. 695 పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నాడు.
ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ పాట్ కమిన్స్ అగ్ర స్థానంలో నిలిచాడు. కమిన్స్ ఖాతాలో 908 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (839 పాయింట్లు) రెండో స్థానంలో, కివీస్ పేసర్ టిమ్ సౌథీ (824 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. జోష్ హాజిల్వుడ్ (816), జేమ్స్ అండర్సన్ (813) టాప్-5లో ఉన్నారు. 758 రేటింగ్ పాయింట్లతో జస్ప్రీత్ బుమ్రా పదవ స్థానంలో ఉన్నాడు. ఆల్రౌండర్ల లిస్ట్లో విండీస్ ప్లేయర్ జేసన్ హోల్డర్ టాప్ స్థానం పదిలం చేసుకున్నాడు. రవీంద్ర జడేజా 3, రవిచంద్రన్ అశ్విన్ 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్ట్ అనంతరం ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా గురువారం నుంచి కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.