ఐసీసీ తాజాగా ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఇందులో టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన హవాను కొనసాగించాడు. 908 పాయింట్లతో తన అగ్రస్ధానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. రీసెంట్ గా జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన బుమ్రా.. ఆ సమయంలోనే 907 పాయింట్లతో టాప్ లో నిలిచాడు. ఆ సిరీస్ లో 5 టెస్టుల్లో 13.06 సగటుతో 32 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ది సిరీస్గానూ నిలిచాడు. ఇప్పుడు మరో పాయింట్ మెరుగుపరుచుకుని.. కెరీర్ బెస్ట్ పాయింట్స్ మార్క్ ను టచ్ చేశాడు.
బుమ్రా తర్వాతి స్థానాల్లో వరుసగా ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(841), సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ(837) ఉన్నారు. ఇక పాకిస్థాన్ నోమన్ అలీ.. వెస్టిండీస్ పై తొలి టెస్ట్ లో ఆరు వికెట్ల ప్రదర్శన చేసి 761 పాయింట్లతో టాప్10లోకి దూసుకెళ్లాడు.

ఆల్ రౌండ్ ర్యాంకింగ్స్ లో జడేజా కూడా తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. 400 పాయింట్లతో టాప్ లో నిలిచాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతడు నామమాత్రంగా ఆడాడు. ఈ సిరీస్లో మొత్తం ఐదు మ్యాచ్ల్లో బరిలోకి దిగిన జడేజా .. 27 యావరేజ్ తో 135 పరుగులు సాధించాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా మార్కో జాన్సన్ (294), బంగ్లాదేశ్ మెహ్దీ హాసన్(263) ఉన్నారు.
ఇక బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారి కిందకు పడిపోయాడు. 43వ ర్యాంక్లో నిలిచాడు. హిట్ మ్యాన్ ఆస్ట్రేలియా సిరీస్ లో తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఐదు ఇన్నింగ్స్ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.