హైదరాబాద్: వెస్టిండిస్తో ఆదివారం కింగ్ స్టన్ వేదికగా జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో కోహ్లీసేన ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 ర్యాంకు పడిపోయింది. సోమవారం ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో భారత్ ఐదో స్ధానానికి పడిపోగా, విండిస్ నాలుగో స్ధానానికి ఎగబాకింది.
మ్యాచ్కు ముందు నాలుగో స్థానంలో ఉన్న కోహ్లీ సేన ఆ తర్వాత 115 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా, మ్యాచ్ గెలిచిన విండీస్ జట్టు ఐదో స్థానం నుంచి 117 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక న్యూజిలాండ్ (125), ఇంగ్లండ్ (123), పాకిస్తాన్ (121) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఇక ఐసీసీ తాజాగా విడుదల చేసిన బ్యాట్స్మెన్ ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 804 రేటింగ్ పాయింట్లతో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్ రెండో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక టీమిండియాతో జరిగిన ఏకైక టీ20లో తన విధ్వంసకర ఇన్నింగ్స్తో సెంచరీ చేసిన విండిస్ ఓపెనర్ లూయిస్ నాలుగో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే పాకిస్థాన్కు చెందిన వసీమ్ అగ్రస్ధానంలో ఉండగా, భారత్కు చెందిన జస్ప్రీత్ బుమ్రా రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.
ఐసీసీ తాజా ర్యాంకులు (జులై 10 నాటికి)
1. న్యూజిలాండ్ -125 రేటింగ్ పాయింట్లు
2. ఇంగ్లాండ్ - 123
3. పాకిస్థాన్ - 121
4. వెస్టిండీస్ -117
5. భారత్ - 115
6. ఆస్ట్రేలియా -110
7. దక్షిణాఫ్రికా - 110
8. శ్రీలంక - 95
9. అఫ్గానిస్థాన్- 86
10. బంగ్లాదేశ్ - 78