
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం వన్డేల్లో అగ్రస్థానంలో, టెస్టులో 5వ స్థానంలో ఉన్న కోహ్లీ.. తాజా టీ20 ర్యాంకింగ్స్లో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో మూడు హాఫ్ సెంచరీలతో అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లీ (762) తన ర్యాంకును మెరుగుపరచుకున్నాడు. ఆఖరి టీ20లో అర్ధ శతకంతో చెలరేగిన రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరచుకొని 14వ ర్యాంకులో నిలిచాడు.
ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో వరుస డకౌట్లతో దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్ (743)ఒక ర్యాంకు కోల్పోయి ఐదో స్థానానికి పడిపోయాడు. టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ ఐదు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ ర్యాంక్ 26వ స్థానం సంపాదించాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ (892) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. రెండవ స్థానంలో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, మూడో స్థానంలో పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ కొనసాగుతున్నారు.
బౌలింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా నుంచి ఏ ఒక్క బౌలర్కు కూడా టాప్-10లో చోటు దక్కలేదు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 597 రేటింగ్ పాయింట్లతో 14వ స్ధానంలో ఉన్నాడు. రీఎంట్రీలో అదరగొట్టిన టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ ఏకంగా 29 స్థానాలు మెరుగుపరుచుకొని 24వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంషీ (733) అగ్రస్థానానికి ఎగబాకగా.. ఆఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (719) రెండో స్థానానికి పడిపోయాడు.
తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 868 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. బాబర్ (837), రోహిత్ (836) రెండు, మూడులో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్లో బౌల్ట్ (743) మొదటి స్థానంలో ఉండగా.. బుమ్రా (697) మూడులో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో జడేజా 9లో ఉన్నాడు. ఇంగ్లండ్తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐదు టీ20ల సిరీస్ను భారత్ 3-2తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇరు జట్లు ప్రస్తుతం వన్డే సిరీస్లో తలపడుతున్నాయి. తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో గెలిచింది.