అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఇందులో భారత ఆటగాళ్లు మరోసారి సత్తాచాటారు. టీ20 బ్యాటింగ్ విభాగంలో టాప్ -10లోనే భారత్ నుంచి ముగ్గురు బ్యాటర్లు చోటు సంపాదించుకున్నారు. రెండో స్థానంలో అభిషేక్ శర్మ (829), నాలుగో స్థానంలో తిలక్ వర్మ (804), ఐదో ర్యాంకులో సూర్య కుమార్ యాదవ్ (739) ఉన్నారు. ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (856)దే అగ్రస్థానంలో నిలిచారు.
ఆల్రౌండర్ విభాగంలో స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య (252) అగ్రస్థానంలో నిలిచారు. ఇక టాప్ -10లో మరో ఇతర భారత జట్టు ప్లేయర్ చోటు సంపాదించుకోలేదు. 12వ స్థానంలో అక్షర్ పటేల్ (161) కొనసాగుతున్నాడు. బౌలర్ల విభాగంలో 3,7,10వ స్థానంలో వరుణ్ చక్రవర్తి (706), రవి బిష్ణోయ్ (674), అర్షదీప్ సింగ్ (653) ఉన్నారు.

వన్డేల్లో..
వన్డేల్లో భారత క్రికెటర్ శుభ్మన్ గిల్ (784) అగ్రస్థానంలోనే ఉన్నాడు. పాక్ ఆటగాడు బాబర్ అజామ్ (777) రెండో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (756) మూడో స్థానం, విరాట్ కోహ్లీ (736) ఐదో స్థానం, శ్రేయస్ అయ్యర్ (704) ఎనిమిదో స్థానంలో ఉన్నారు. బౌలర్ల జాబితాలో టాప్ -10లో ఇద్దరు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. కుల్దీప్ యాదవ్ (650) ఒక్క స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా (616) ఒక స్థానం ముందుకు జరిగి 9వ ర్యాంకులో నిలిచాడు. ఆల్ రౌండర్ల జాబితాలో జడేజా పదో స్థానాన్ని దక్కించుకున్నాడు.