
నాలుగో వేదికగా మస్కట్:
టీ20 ప్రపంచకప్ కోసం ఒమన్ రాజధాని మస్కట్ను కూడా నాలుగో వేదికగా పరిగణలోకి తీసుకున్నారట. యూఏఈలోని అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికలే కాకుండా.. నాల్గవ వేదికగా మస్కట్ను కూడా జాబితాలో చేర్చారట. ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచులను యూఏఈలోనే పొట్టి కప్కు ముందు నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ప్లాన్ చేసింది. ఐపీఎల్ అనంతరం ప్రపంచకప్ కోసం పిచ్లు సిద్ధం చేసేందుకు మూడు వారాల సమయం ఉంటుంది. అదే సమయంలో మొదటి వారం మ్యాచులు ఒమన్లో నిర్వహిస్తారని సమాచారం తెలుస్తోంది. బీసీసీఐ అధికారి ఒకరు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు.

ఒమన్లో మొదటి వారం మ్యాచులు:
'టీ20 ప్రపంచకప్ కోసం ఐసీసీ సమావేశంలో బీసీసీఐ నాలుగు వారాల సమయం కోరింది. పొట్టి కప్ నిర్వహణ హక్కులిస్తే.. యూఏఈ, ఒమన్లో జరిపేందుకు అంగీకారమేనని అంతర్గతంగా చెప్పింది. ఒకవేళ ఐపీఎల్ 2021 అక్టోబర్ 10న ముగిసినా.. నవంబర్లో టీ20 ప్రపంచకప్ యూఏఈ లెగ్ ఆరంభమవుతుంది. పిచ్లు సిద్ధం చేసేందుకు మూడు వారాల సమయం ఉంటుంది. అదే సమయంలో మొదటి వారం మ్యాచులు ఒమన్లో నిర్వహిస్తారు' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

మూడోవేవ్ పరిస్థితి ఎలా ఉంటుందో:
'పొట్టి కప్ను భారత్లో అక్టోబర్-నవంబర్లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తుందని ఐసీసీ సభ్యులు భావిస్తున్నారట. కానీ అప్పటి పరిస్థితులను అంచనా వేయడం కష్టమంటున్నారు. 'ప్రస్తుతం భారత్లో రోజుకు లక్ష్యా 20 వేల కరోనా కేసులు వస్తున్నాయి. ఏప్రిల్ ఆరంభంలో నమోదైన వాటిలో ఇది పావువంతు. జూన్ 28కి మెగా టోర్నీని భారత్లో నిర్వహిస్తామని ఐసీసీకి చెబితే.. అక్టోబర్లో మూడోవేవ్ పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేం. ఐపీఎల్ రెండో దశను తరలించేందుకు వర్షాకాలం సరైన కారణం కాదని, అసలు కారణం కరోనా అని బీసీసీఐకీ తెలుసు. దాదాపుగా రూ.2500 కోట్ల ఆదాయం దానిపై ఆధారపడి ఉంది' అని సదరు అధికారి వెల్లడించారు.

15 మందిని భర్తీ చేయడం కష్టం:
'16 జట్ల ప్రపంచకప్లో ఏదో ఒకజట్టు కరోనా వైరస్ బారిన పడితే.. ఆ పరిస్థితే ఊహించలేం. బలహీన దేశాల జట్లకు 14-15 మందిని భర్తీ చేసేందుకు ఏమాత్రం వీలుండదు. ఒకవేళ భారత్లో నిర్వహిస్తే విదేశీ ఆటగాళ్లు వస్తారో లేదో కూడా తెలియదు. యూఏఈలో ఐపీఎల్ 2021 ఆడేందుకు వచ్చే విదేశీ క్రీడాకారులు, అక్కడే టీ20 ప్రపంచకప్ ఆడేందుకు సంతోషిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులను క్షేమంగా చూసుకోవడం ఎంతో అవసరం. దీనికి స్థానిక బోర్డులు, ప్రభుత్వాల సాయం అవసరం' అని ఆ బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












