
ముంబై: ప్రస్తుతం దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ 2021 సీజన్, 14వ ఎడిషన్ మెగా క్రికెట్ టోర్నమెంట్ రసవత్తరంగా సాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ మ్యాచ్లను ప్రత్యక్షంగా తిలకించడానికి ప్రేక్షకులకు అనుమతి ఇవ్వలేదు. గత ఏడాది తరహాలోనే ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు కొనసాగుతున్నాయి. ఈ టర్నమెంట్లో ఆడుతోన్న అన్ని జట్లు శుక్రవారం నాటికే రెండేసి చొప్పున మ్యాచ్లను పూర్తి చేశాయి. మూడో రౌండ్లో తొలి మ్యాచ్.. ఈ సాయంత్రం ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య సాగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం దీనికి వేదికగా మారింది.
ఇదిలావుండగా.. ఐసీసీ ప్రపంచకప్ టోర్నమెంట్కు సంబంధించిన తాజా అప్డేట్ను ప్రకటించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఈ ఏడాదే నిర్వహించబోయే టీ20 ప్రపంచకప్ మ్యాచ్ల కోసం వేదికలను ఖరారు చేసింది. ఈ ప్రపంచకప్ ఈ ఏడాది అక్టోబర్లో ఆరంభం కానుంది. గత ఏడాదే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేసింది బీసీసీఐ. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నప్పటికీ.. బయో బబుల్ సెక్యూర్ వ్యవస్థను ఆటగాళ్ల కోసం అమలు చేస్తోంది. మ్యాచ్లను ప్రత్యక్షంగా తిలకించడానికి ప్రేక్షకులకు అనుమతి ఇవ్వట్లేదు.
అక్టోబర్ నాటికి సాధారణ పరిస్థితులు ఏర్పడితే.. ప్రేక్షకులకు అనుమతించే అవకాశాన్ని పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ ఇదివరకే స్పష్ం చేసింది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ మ్యాచ్ల కోసం పరిమితంగానే స్టేడియాలను ఎంపిక చేసింది బీసీసీఐ. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా, ముంబైలోని వాంఖెడె, చెన్నైలోని ఎంఏ చిదంబరం, కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్, బెంగళూరులోని చిన్నస్వామి, హైదరాబాద్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ధర్మశాలలోని హిమాలయా క్రికెట్ అసోసియేషన్ స్టేడియాలను ఎంపిక చేసింది. ఇక ఫైనల్ మ్యాచ్.. అందరూ ఊహించినట్టే- గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహిస్తారు.
ఈ టోర్నమెంట్లో ఆడటానికి పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు లేవు. బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ జాతీయ జట్టు భారత్లో పర్యటించడానికి అవసరమైన విసాలను మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించినట్లు కూడా పేర్కొంది. దీనికోసం కార్యదర్శి జయ్ షా.. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. మ్యాచ్లను ప్రత్యక్షంగా తిలకించడానికి పాకిస్తాన్తో పాటు ఏ దేశానికి చెందిన అభిమానులను భారత్ సందర్శనకు అనుమతి ఇవ్వాలా? లేదా? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.