హరారే: ఒక్క రూపాయి కూడా మ్యాచ్ ఫీజు తీసుకోకుండా క్రికెట్ మ్యాచ్లు ఆడుతాం. మా (జింబాబ్వే) దేశంలో ఎలాగైనా క్రికెట్ను బతికించుకుంటాం అని జింబాబ్వే క్రికెటర్లు అంటున్నారు. ఐసీసీ రాజ్యాంగానికి విరుద్ధంగా జింబాబ్వే క్రికెట్ వ్యవహారాల్లో ఈ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి జింబాబ్వేను ఐసీసీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
2020 టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఆగస్టులో మహిళల క్వాలిఫయర్స్, అక్టోబర్లో పురుషుల క్వాలిఫయర్స్ మ్యాచ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ దేశంలో క్రికెట్ను బతికించుకొనేందుకు జింబాబ్వే క్రికెటర్లు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మ్యాచ్ ఫీజు ఇవ్వకున్నా కూడా ఆడేందుకు సిద్ధమని తెలిపారు. ఇదే విషయాన్ని ఆటగాళ్లు జింబాబ్వే క్రీడల శాఖ మంత్రికి కూడా చెప్పారని సమాచారం తెలిసింది.
గత రెండు నెలలుగా పురుషులు, మహిళల జట్లకు జింబాబ్వే బోర్డు మ్యాచ్ ఫీజు చెల్లించడం లేదు. ఇక సస్పెన్షన్ కారణంగా ఐసీసీ నుంచి కూడా జింబాబ్వే క్రికెట్ బోర్డుకు నిధులు అందడం లేదు. ఐసీసీ సస్పెన్షన్ విధించినా.. ఇతర దేశాలతో ద్వైపాక్షిక సిరీసులు ఆడుకొనేందుకు అనుమతి ఇచ్చింది. అయినా కూడా బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్లతో సెప్టెంబర్లో జరగాల్సిన టీ20 ట్రై సిరీస్లో తమ ఆటగాళ్లు పాల్గొనబోరని జింబాబ్వే క్రికెట్ బోర్డు పేర్కొంది. మరోవైపు అక్టోబరులో జరిగే ఐసీసీ సమావేశంలో జింబాబ్వేపై సస్పెన్షన్పై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.