హైదరాబాద్: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడో టెస్టుకు దూరమయ్యాడు. కొలంబోలో ఆదివారం ముగిసిన రెండో టెస్ట్లో ఓపెనర్ దిముత్ కరుణరత్నే పట్ల జడేజా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడు. దీంతో ఐసీసీ జడేజాపై సస్పెన్షన్ వేటు వేసింది.
దీంతో ఆగస్టు 12 నుంచి బాలగొల్లలోని పల్లెకెలే స్టేడియంలో జరిగే మూడో టెస్టుకి జడేజా దూరమయ్యాడు. మైదానంలో కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించడం జడేజాకు ఇది తొలిసారి కాదు. రెండేళ్ల క్రితం న్యూజిలాండ్తో భారత్లో జరిగిన టెస్ట్మ్యాచ్లోనూ ఇలానే ప్రవర్తించాడు.

మూడో రోజు ఆట సందర్భంగా క్రీజులో ఉన్న కరుణరత్నేను లక్ష్యంగా చేసుకుంటూ జడేజా బంతిని విసిరాడు. ఈ సంఘటన ఇన్నింగ్స్ 58వ ఓవర్లో చోటు చేసుకుంది. దీనిని ఫీల్డ్ అంపైర్లు బ్రూస్ ఆక్సన్ఫోర్డ్, రాడ్ టకర్ నివేదించాడు. దీంతో జడేజా బంతిని ప్రమాదకరంగా విసిరాడని మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్స్సన్ జడేజా ఖాతాలో3 డీమెరిట్ పాయింట్లు చేర్చడంతో పాటు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించాడు.
దీంతో 24 నెలల వ్యవధిలో డీమెరిట్ పాయింట్లు 6కు చేరుకోవడంతో జడేజాపై టెస్టు సస్పెన్షన్ వేటు పడింది. దీంతో చివరిదైన మూడో టెస్టులో జడేజా స్ధానంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ మూడో టెస్ట్లో ఆడే అవకాశముంది. కాగా, జడేజాపై ఐసీసీ విధించిన నిషేధాన్ని స్వాగతిస్తున్నట్టు అతడి సోదరి నైనా పేర్కొన్నారు.
జడేజా అద్భుతంగా ఆడుతున్నప్పటికీ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే భవిష్యత్తులో మరోసారి ఇలా ప్రవర్తించకుండా ఇలా చేయడం మంచిదేనని నైనా పేర్కొన్నారు.