కరాచీ: అయిదు రోజుల క్రితం భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ముఖ్యంగా చివరి ఓవర్ నరాలు తెగే ఉత్కంఠ. చివరి మూడు బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన తరుణంలో బంగ్లా ఆటగాళ్లు షాట్లు కొట్టబోయి, వికెట్లు పోగొట్టుకున్నారు. దీంతో భారత్ను విజయం వరించింది.
దీనిపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ తౌసీఫ్ అహ్మద్ కొత్త వాదానికి తెరలేపాడు. బంగ్లా - భారత్ మ్యాచ్ పైన అనుమానాలు ఉన్నాయని చెప్పాడు. ఈ మ్యాచ్ పైన ఐసీసీ అవినీతి నిరోధక విభాగం, భద్రతా యూనిట్ దర్యాఫ్తు జరపాల్సిన అవసరం ఉందని చెప్పాడు.

మ్యాచ్ ముగిసిన తీరు చూస్తే ఏదో జరిగినట్లుగా నాకు తోస్తోందని చెప్పాడు. ఐసీసీ అధికారులు దీని పైన విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నాడు. మూడు వికెట్ల చేతిలో ఉండగా, మూడు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో బంగ్లాదేశ్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. 57 ఏళ్ల తౌసీఫ్ అహ్మద్ పాకిస్తాన్ జట్టు తరఫున 70 వన్డేలు ఆడాడు. 34 టెస్టులు ఆడాడు.